మద్యం దుకాణాల్లో 15వేల ఉద్యోగాలు, రూ.17,500 వేతనం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా మద్య పాన నిషేధాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు గత కొద్ది రోజులుగా వరుసగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీనిపై నాలుగు కమిటీలను ఏర్పాటయ్యాయి. మద్యం దుకాణాలు, దుకాణాల ప్రదేశాల ఎంపిక, కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బంది నియామకం, మద్యం షాపుల్లో ఫర్నీచర్, మౌలిక సదుపాయాల కల్పనకు, డిపోల నుంచి షాపులకు సరుకు రవాణా ఛార్జీలను ఖరారు చేయడానికి కమిటీలకు బాధ్యతలు అప్పగించారు.

కొత్త పాలసీ ద్వారా టెండర్లు
కొత్త పాలసీ ద్వారానే మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. సిబ్బంది, నియామక ప్రక్రియ మినహా అన్నింటికి టెండర్లు నిర్వహిస్తారు. ఫర్నీచర్, రవాణా ఛార్జీల ఖరారు, షాపులకు అద్దె వంటి వాటికి టెండర్లు నిర్వహిస్తారు. కమిటీలకు జిల్లా సంయుక్త కలెక్టర్లు చైర్మన్గా, కన్వీనర్లు ఆయా డిపోల నోడల్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, మద్యం షాపు ఏర్పాటయ్యే స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, డిపో మేనేజర్లు ఉంటారు. సరకు రవాణా ఛార్జీల నిర్ణయ కమిటీలో రీజినల్ ట్రాన్సుపోర్ట్ ఆఫీసర్ సభ్యుడిగా ఉంటారు.

15,000 ఉద్యోగాలు
అక్టోబర్ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 15వేల మందికి ఉపాధి కల్పించనున్నారు. బీసీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం మొత్తం యాభై శాతం రిజర్వేషన్ ఇస్తారు. మద్య పాన నిషేదం దిశగా అడుగులో భాగంగా 4,380 మద్యం షాపులకు గాను 880 షాపులు పోను, మిగతా 3500 దుకాణాల్లో పదిహేనువేల మందిని నియమిస్తారు.

మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు....
పట్టణాల్లో ఉండే మద్యం దుకాణాల్లో నలుగురు చొప్పున, గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమిస్తారు. మద్యం షాపుల్లో అర్బన్ అయితే... 1 సూపర్ వైజర్, 3 సేల్స్మెన్, 1 సెక్యూరిటీ గార్డు, గ్రామీణం అయితే... 1 సూపర్ వైజర్, 2 సేల్స్మెన్, 1 సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. మొత్తంగా 15వేల ఉద్యోగాల్లో 7,500 ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు దక్కనున్నాయి.

ఉద్యోగులకు వేతనాలు ఇలా...
ఉద్యోగుల వేతనం... సూపర్ వైజర్ కు రూ.17,500, సేల్స్ మెన్ కు రూ.15 వేలు నిర్ణయించారని సమాచారం. సూపర్ వైజర్ కు డిగ్రీ, సేల్స్ మెన్ కు ఇంటర్ విద్యార్హతగా నిర్ణయించారు. ఉద్యోగులను ఏడాది ప్రాతిపదికన మాత్రమే తీసుకుంటారు. మద్యం నిల్వలు సిబ్బంది వద్ద ఉంటాయి. కాబట్టి వారి నుంచి బాండ్లను స్వీకరిస్తారు. గతంలో వలె సెక్యూరిటీ డిపాజిట్ అవసరం లేదు. అవకతవకలకు పాల్పడితే బాండ్స్ ద్వారా రికవరీ చేస్తారు.


Click it and Unblock the Notifications