రైతులకు ప్రభుత్వం షాక్: బంగారం తాకట్టుతో రుణం లేదు, ఇవి తప్పనిసరి
న్యూఢిల్లీ: రైతులకు ప్రభుత్వం షాకిచ్చింది. వ్యవసాయ పెట్టుబడుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి తీసుకునే రుణాలు ఇక వ్యవసాయ రుణ ఖాతాలోకి రావు. వాటికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇవ్వదు. సాధారణ ప్రజలు బంగారాన్ని తాకట్టు పెడితే ఏ వడ్డీని వసూలు చేస్తున్నాయో, అలాగే చార్జ్ చేయనున్నాయి. సాధారణ ప్రజలు బంగారాన్ని తాకట్టు పెడితే బ్యాంకులు 9 శాతం నుంచి 10.5 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి రైతులకు కూడా ఇదే వర్తిస్తుంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ దేశంలోని అన్ని బ్యాంకులకు, రాష్ట్ర వ్యవసాయ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
అలర్ట్: ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, కొత్త పెనాల్టీ పూర్తి లిస్ట్
రుణం తీసుకోవచ్చు.. కానీ బంగారం తాకట్టు పెడితే...
రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (SLBC) ఒక్కో పంటకు ఎకరాకు ఎంత రుణం ఇవ్వవచ్చునో ప్రతి ఏడాది నిర్ణయిస్తుంది. దీనిని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి) అంటారు. దీని ప్రకారం రైతులు తాము వేసే పంటకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవచ్చు. అయితే బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకుంటే దానిని మాత్రం పంట రుణంగా చూపవద్దు.
కిసాన్ క్రెడిట్ కార్డుతో తీసుకుంటే వడ్డీ రాయితీ
రైతులు పంట రుణాన్ని కిసాన్ క్రెడిట్ కార్డుతోనే తీసుకోవాలి. ఈ ఖాతాకు రైతు ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని నిబంధన పెట్టింది. అలా చేస్తే వడ్డీ రాయితీ లభిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెల ఒకటవ తేదీ నుంచి పంటలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది.
గడువులోగా రుణాలు తీర్చకుంటే రాయితీ రద్దు
పంట రుణంగా తీసుకున్న బకాయినీ బ్యాంకులకు గడువు లోగా చెల్లించాలి. రుణం తీసుకున్నప్పటి నుంచి ఏడాది వరకు గడువు ఉంటుంది. ఆ లోగా చెల్లిస్తే గడువులోగా రుణాలు చెల్లించినట్లు. ఈ గడువులోగా రుణాలు చెల్లించకుంటే వడ్డీ భరించవలసి ఉంటుంది.
గడువు దాటితే ఎంత శాతం వడ్డీ..
గడువులోగా రుణం తీర్చకుంటే బ్యాంకులు 7 శాతం వడ్డీని ఛార్జ్ చేస్తాయి. రైతులు తీసుకునే ఈ రుణాలపై కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీని చెల్లిస్తుంది. ఇలా ప్రభుత్వాలు చెల్లించే రాయితీని వడ్డీ రాయితీగా చెబుతారు. గడువులోగా రుణాలు చెల్లించకుంటే కేంద్రం వడ్డీని చెల్లించదు. ఉదాహరణకు తెలంగాణలో ప్రభుత్వం వడ్డీ లేని రుణాన్ని అమలు చేస్తోంది. ఇందులో కేంద్రం 3 శాతం ఇస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం 4 శాతాన్ని చెల్లిస్తోంది. ఇక నుంచి గడువులోగా రుణాలు చెల్లించకుంటే బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి.
ఎందుకిలా...
రైతులు పంట రుణంగా లక్ష రూపాయల వరకు తీసుకుంటే గత ఏడాది వరకు వడ్డీ రాయితీ ఇచ్చేవారు. ఆ తర్వాత రుణ పరిమితిని రూ.3 లక్షలకు పెంచింది. రైతులు పంట రుణం తీసుకున్న తర్వాత తిరిగి బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణంగా తీసుకొని దానిపై కూడా వడ్డీ రాయితీ పొందే అవకాశముంది. దీనిని నివారించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని ఉండి ఉంటుందని చెబుతున్నారు.
మరో కారణం కూడా...
ప్రతి బ్యాంకు ఇచ్చే రుణాల్లో 18 శాతం వరకు వ్యవసాయ రుణాలు ఇవ్వాలనే నిబంధన ఉంది. కొన్ని బ్యాంకులు రైతుల నుంచి బంగారం పూచీకత్తుగా తీసుకొని రుణాలు ఇస్తున్నాయి. వాటిని వ్యవసాయ రుణాలుగా చూపిస్తున్నాయి. బంగారాన్ని వ్యవసాయ రుణం జాబితా నుంచి తొలగిస్తే బ్యాంకులు వాస్తవంగా ఎంత పంట రుణం ఇస్తాయో తేలుతుందని అంటున్నారు.