చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్, భారీ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ ప్రారంభమయ్యాయి. గురువారం సెన్సెక్స్ 463 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్ల భారీ నష్టంతో ముగిశాయి. ఈ రోజు కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, వాహన విక్రయాలు వంటి కారణాలతో పాటు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై తాజాగా అధిక టారిఫ్ విధించడం కూడా ఈ రోజు మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ కావడానికి కారణంగా చెబుతున్నారు.
నిఫ్టీ 10,875 పాయింట్లకు దిగువన పడిపోయింది. ఈ ఏడాది మార్చి తర్వాత ఇలా దిగజారిపోవడం ఇదే మొదటిసారి. అమెరికా - చైనా మధ్య ట్రేడ్ వార్ ముగుస్తుందని భావిస్తున్నప్పటికీ, ఎప్పటికప్పుడు వేడి రాజుకుంటుంది. ఈ ప్రభావం కారణంగా గురువారం అమెరికా మార్కెట్లు పతనమయ్యాయి. చైనాకు చెందిన 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై 10 శాతం టారిఫ్ విధిస్తామని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ప్రభావంతో వాల్ స్ట్రీట్ నష్టాల్లో ట్రేడింగ్ ముగించింది.

జపాన్కు చెందిన నిక్కీ 2.43 శాతం నష్టంతో, హాంగ్కాంగ్ యొక్క హాంగ్ సంగ్ 2.40 శాతం వరకు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారతీయ మార్కెట్లు భారీగానే నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. భారీగా నష్టపోయిన కంపెనీల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి.
భారతీ ఎయిర్ టెల్ ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో నికర నష్టాలను చవి చూసింది. అయినప్పటికీ ఎయిర్ టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల పలు సాఫ్టువేర్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు శుక్రవారం ఉదయం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.


Click it and Unblock the Notifications