భారత్, చైనా సహా 48 దేశాలకు ఎంట్రీ వీసా ఫీజు మాఫీ: శ్రీలంక
కొలంబో: శ్రీలంక మరింతమంది పర్యాటకులను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకోనుంది. భారత్, చైనా సహా మొత్తం 48 దేశాల ప్రయాణీకుల కోసం ఇప్పటికే ఉన్న ఎంట్రీ వీసా ఫీజును ఆగస్ట్ 1వ తేదీ నుంచి మాఫీ చేయనుందని బుధవారం ఓ అధికారి వెల్లడించారు.
భారత్, చైనా, అమెరికా, జర్మనీ, కెనడా, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ప్రస్తుతం వీసా ఫీజు 25 డాలర్లుగా ఉందని, దీనిని మాఫీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని టూరిజం డెవలప్మెంట్, వైల్డ్ లైఫ్ అండ్ క్రిస్టియన్ రిలీజియస్ అఫైర్ మినిస్టర్ జాహన్ అమరతుంగ వెల్లడించారు.
ప్రస్తుతానికి ఈ విధానం ఆరు నెలల పాటు అమలులో ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత దీని పొడిగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇండిగో బంపరాఫర్, రూ.999కే టిక్కెట్
శ్రీలంకను సందర్శించాలనుకునే ప్రయాణీకులు ఆయా దేశాల్లోని శ్రీలంక రాయబార కార్యాలయ వెబ్సైట్లను యాక్సెస్ చేసి లేదా ఇమ్మిగ్రేషన్ వెబ్ సైట్ను సందర్శించి అవసరమైన సమాచారాన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమర్పించి వీసా అనుమతిని పొందవచ్చునని ఇమ్మిగ్రేషన్ అండ్ ఎమిగ్రేషన్ కంట్రోలర్ జనరల్ పవన్ రత్నాయకే తెలిపారు. శ్రీలంకకు ప్రయాణించేవారు వీసా అనుమతి పొందని పక్షంలో బండారనాయకే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని వీసా కౌంటర్లో అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలన్నారు.
తమ జాబితాలోని దేశాల వారికి ఉచిత 30 రోజుల వీసా ఇస్తామని, మరింతకాలం పొడిగింపు కావాలంటే అవసరమైన చెల్లింపులు జరపాలని రత్నాయకే చెప్పారు.
కాగా, ఏప్రిల్ 21వ తేదీన ఆదివారం రోజు ఉగ్రవాద దాడి కారణంగా 250 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. దీంతో శ్రీలంక టూరిజంపై ప్రభావం పడింది. ఇలాంటి పరిస్థితుల్లో, టూరిస్టులను ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి 1.9 మిలియన్ల నుంచి 2 మిలియన్ల టూరిస్టులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉగ్రదాడికి సంబంధించిన అందరినీ అరెస్టు చేశామని, శ్రీలంక ఇప్పుడు సేఫ్ అని, ట్రావెలర్స్కు ఎలాంటి భయం లేదని ప్రధాని రణీల్ విక్రమ సింఘే చెప్పారు.