జగన్ సంచలన నిర్ణయం ! ఇండస్ట్రీ సర్కిల్స్లో రచ్చరచ్చ
ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకూ ఏ రాష్ట్రంలో లేని విధంగా స్థానిక యువతకు ప్రైవేట్ కార్పొరేట్ ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్లలోగా ప్రతీ ప్రైవేట్ సంస్థా ఈ నిబంధనకు కట్టుబడి తీరాల్సిందేనంటూ అసెంబ్లీలో బిల్లు తీర్మానం సందర్భంగా తేల్చారు. దీంతో ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ సంస్థల్లో గుండెలకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే గతంలో కేటాయించిన కాంట్రాక్టుల రద్దు, ప్రైవేట్ విద్యుత్ ఒప్పందాల విషయంలో పునరుద్ధరణ సహా అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటున్న ఆయన.. అత్యంత సున్నితమైన ఈ వ్యవహారాన్ని అప్పుడే ఇంత ఆవేశంగా తీసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా?: గుర్తుంచుకోండి..
తమిళనాడు కూడా...
మన రాష్ట్రంలోనే కాదు గతంలో కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఒత్తిడే వచ్చింది. పెద్ద పెద్ద ఉద్యమాలే జరిగాయి. ప్రభుత్వ సంస్థ అయిన రైల్వేల విషయంలో బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎలాంటి గొడవ జరిగిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నెలకొల్పిన ముఖ్యమంత్రి కమల్నాధ్ కూడా స్థానికులకు 70 శాతం ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంటూ చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఇంతవరకూ ఏ రాష్ట్రమూ అంత సాహసం చేసి ప్రైవేట్ సంస్థలతో సున్నం రాసుకున్న దాఖలాలు కనిపించలేదు. మరి ఈ సమయంలో ఏపీ సిఎం జగన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది.
యాక్ట్ ఏం చెబ్తోంది ?
సోమవారం ఏపీ అసెంబ్లీలో పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ యాక్ట్ 2019 ప్రకారం స్థానికులకు ఉద్యోగాల్లో 75 శాతం రిజర్వేషన్ ఉండాలి. ప్రైవేట్ - ప్రభుత్వ భాగస్వామ్యంతో చేసే సంస్థలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఇక్కడ ఇంకో చిక్కు ఏమిటంటే.. ఒక వేళ సదరు ఉద్యోగానికి స్థానిక అభ్యర్థి లేకపోతే.. వాళ్లకు శిక్షణనిచ్చి మరీ వీధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. మూడేళ్లలో ఈ నిబంధన పూర్తిగా అమలు చేయాలి. ప్రతీ త్రైమాసికానికి ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రత్యేక నోడల్ ఏజెన్సీకి సమర్పించాలి.
అయితే ఫ్యాక్టరీస్ యాక్ట్ ఫస్ట్ షెడ్యూల్లో ఉన్న ఫార్మా, కోల్, ఫర్టిలైజర్, పెట్రోలియం, సిమెంట్ నుంచి ప్రస్తుతానికి వీటికి మినహాయింపునిచ్చారు.
ఇండస్ట్రీ ఏం అంటోంది
ఇది చాలా సున్నితమైన అంశం. కోడి ముందా గుడ్డి ముందా అనే వ్యవహారం. ముందు మీరు నేర్చుకుంటే మీకు ఉద్యోగాలు ఇస్తాం అని కంపెనీలు ఉంటాయి. ముందు ఉద్యోగం ఇచ్చిన తర్వాతే మేం నేర్చుకుంటాం అని నిరుద్యోగ యువత అంటుంది. అందుకే ముందు స్కిల్లింగ్ పై దృష్టిపెట్టాల్సిన అత్యవసర సమయమిది. ఇండస్ట్రీలో ఒప్పందం కుదుర్చుకుని సామర్యపూర్వకంగా పోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ ఆటోమేషన్ యుగంలో ఉన్న ఉద్యోగాలకే ఎసరొస్తోంది. అంతా రోబో మయమవుతోంది. బెస్ట్ ఆఫ్ బెస్ట్ మాత్రమే మిగుల్తున్నారు. ఇలాంటి తరుణంలో పక్కా లోకల్.. అనే పాటలు పాడితే కష్టం. అందుకే ట్రైనింగ్ ఫస్ట్ అంటున్నారు సిఐఐ ఏపీ ఛైర్మన్ గల్లా విజయనాయుడు. దీని వల్ల లాభం ఎంత ఉందో నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందని, ప్రాంతాల వారీగా క్లస్టర్ల వంటివి ఏర్పాటు చేసి శిక్షణనివ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
ఏ రాష్ట్రం ఎందుకు సాహసించలేదు ?
ఉద్యోగమనేది స్కిల్ అంటే.. నైపుణ్యానికి సంబంధించిన విషయం. మన ఊరివాడనో.. లేక మనకు తెలిసిన వాడనో.. ఏ పనినీ ఎవరికీ అప్పగించలేము. క్లీనింగ్, హౌస్ కీపింగ్, గార్డెనింగ్ వంటి వాటికి పెద్దగా నైపుణ్యం లేకపోయినా ఫర్వాలేదు కానీ ఇండస్ట్రీలో మాత్రం సదరు ఉద్యోగానికి సంబంధించి అనుభవం లేకపోతే మాత్రం ఏ కంపెనీ కూడా ఉద్యోగంలో తీసుకోరు. కోట్లలో పెట్టుబడులు పెట్టి అసమర్థులను తీసుకోవడానికి ఏ కంపెనీ యాజమాన్యమూ తీసుకోదు.
ఉదాహరణకు అనంతపురంలోని కియా మోటార్స్ తీసుకుందాం. అక్కడ స్థానికులకు పెద్ద పీట వేస్తామని సంస్థ చెప్పినా అక్కడ జరుగుతోంది మాత్రం వేరు. ఉద్యోగులను తీసుకున్నారు కానీ.. పూర్తిగా గ్రౌండ్ స్టాఫ్కి, ఇంకా చెప్పాలంటే గ్రూప్ 4 కేటగిరీ ఉద్యోగులను వాళ్లు ఎక్కువగా స్థానికులను తీసుకున్నారు. హై ఎండ్ వర్క్స్, క్వాలిటీ లేబర్నంతా కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మన రాష్ట్రంలో ఆటోమొబైల్ పరిశ్రమే లేదు. అలాంటప్పుడు మన రాష్ట్రంలో ఆ స్కిల్ తెలిసిన వాళ్లు ఉండడం తక్కువ. ఇప్పుడే కాదు.. రెండు మూడేళ్లైనా అంత త్వరగా అంత మంది నైపుణ్యంతో కూడిన వారు తయారు కావడం కష్టమైన పని. అలాంటి పరిస్థితుల్లో స్థానికులకే పెద్ద పీట వేయాలని కంపెనీ పొరపాటున కూడా అనుకోదు. కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చూసి స్థానిక మంత్రం జపించరు. ఒక వేళ ఒత్తిడి తెస్తే.. చేసేది లేక చివరకు సెక్యూరిటీ గార్డ్స్, డ్రైవర్స్, హౌస్ కీపింగ్, గార్డెనర్స్, కుక్స్, క్లీనర్స్ వంటి వాళ్లను తీసుకుని ఏదో సర్దిపెట్టేస్తారు. దీని వల్ల నిజంగానే ప్రయోజనం ఉంటుందా అనే అంశాన్ని ఆలోచించాలి.