ఫేస్బుక్కు భారీ షాక్, రూ.34,000 కోట్ల జరిమానా
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు భారీ షాక్. కేంబ్రిడ్జ్ అనలిటికా ప్రైవసీ వయోలేషన్స్ అంశంపై అమెరికా నియంత్రణ సంస్థలు గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీ జరిమానాకు సిద్ధమైంది. ప్రైవసీ, డేటా రక్షణ లోపాల కేసు పరిష్కారంలో భాగంగా 5 బిలియన్ డాలర్లు ఫైన్ వేయాలని నిర్ణయించింది. మన రూపాయల్లో దాదాపు రూ.34వేల కోట్లు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిందనే ఆరోపణలను ఫేస్బుక్ ఎదుర్కొంటోంది.
చదవండి: పాన్ - ఆధార్ లింక్పై గుడ్న్యూస్, కానీ షరతు
ఫెడరల్ ట్రేడ్ కమిషన్ జరిమానా
సోషల్ నెట్ వర్క్ గోప్యత, సమాచార రక్షణ లోపాలు వంటి కారణాలతో ఫేస్బుక్పై జరిమానా విధించేందుకు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) సిద్ధమవుతోంది. దర్యాఫ్తు సెటిల్మెంట్లో భాగంగా FTC రూ.34,280 కోట్ల జరిమానా విధించనుంది. ఇందుకు 3:2 నిష్పత్తిలో FTCకి మద్దతు లభించందని వాల్ స్ట్రీట్ జనరల్ తెలిపింది. వ్యక్తిగత భద్రతా వైఫల్యాలకు ఓ సంస్థపై FTC ఇంత భారీ జరిమానా విధించడం ఇది మొదటిసారి. ఈ నియంత్రణ మండలిలోని డెమోక్రాట్ సభ్యులు సెటిల్మెంట్ ప్రతిపాదనను వ్యతిరేకించగా, రిపబ్లికన్ సభ్యులు మద్దతు పలికారు, దీనికి అమెరికా జస్టిస్ డిపార్టుమెంట్ సివిల్ డివిజన్ తెలపాల్సి ఉంది.
నియమాలు ఉల్లంగిస్తే
ఈ సెటిల్మెంట్లో భాగంగా వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించి ఫేస్బుక్కు కఠిన ఆంక్షలు విధించనున్నట్లుగా తెలుస్తోంది. వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు 2011లో FTC ఫేస్బుక్తో ప్రైవసీ సెటిల్మెంట్ చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వినియోగదారుల సమాచారాన్ని తమ వ్యాపార భాగస్వామ్య సంస్థలకు అందించేటప్పుడు కొన్ని నిమయాలు పాటించాలి. వాటిని ఉల్లంఘిస్తే జరిమానా విధించే హక్కు ఉంది.
నియంత్రణ.. జరిమానా
2012లో సెర్చింజన్ గూగుల్ పైన 2.2 కోట్ల డాలర్ల ఫైన్ విధించింది. ఇప్పుడు ఫేస్బుక్కు 500 కోట్ల డాలర్ల భారీ జరిమానా చెల్లించాల్సి రానుంది. వ్యక్తిగత వివరాల భద్రత విషయంలో ఫేస్బుక్పై ఇటీవలి కాలంలో ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ వ్యాపార విధానం మారాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా రెగ్యులేటర్ల నుంచే ఈ తరహా సూచనలు వస్తుండటంతో తాజా జరిమానాల మధ్య ఫేస్బుక్ వ్యాపార విధానం, నిర్వహణ మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఫేస్బుస్, ఇన్స్టాగ్రామ్, వాట్పాప్ సేవలపై ప్రత్యేక నియంత్రణ ఉండాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి. జనవరి - మార్చిలో ఫేస్బుక్ ఆదాయం గతంతో పోల్చితే 26 శాతం పెరిగి 15.1 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఇందులో లాభం 2.4 బిలియన్ డాలర్లు. కాబట్టి ఈ జరిమానా పెద్దగా ప్రభావం చూపదని అంటున్నారు.