వారికీ స్కీం: లక్షలమందికి ప్రయోజనం కలిగే గుడ్న్యూస్ చెప్పిన జగన్
అమరావతి: వైసీపీ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా శుభవార్త చెప్పింది. రైతు భరోసా స్కీం కౌలు రైతులకు వర్తింప చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రతి రాయితీ కౌలు రైతులతో సహా రైతులందరికీ వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు అన్నదాతలందరికీ అందేలా చూడాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసమే వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం వ్యవసాయ తొలి మిషన్ జరిగింది.
చదవండి: మోడీ సాయం... జగన్ రైతుభరోసాకు రూ.5,085 కోట్లు, వారు అర్హులేనా?
కౌలు రైతులకు కూడా రైతు భరోసా
మార్కెట్ స్థిరీకరణ ఫండ్ రూ.3,000 కోట్లు, విపత్తు నిర్వహణ కోసం రూ.2,000 కోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూలై 8న వైయస్సార్ జయంతి రోజున రైతు దినోత్సవంగా నిర్వహించాలని, అన్నదాతలకు ఇచ్చిన హామీలు ఆ రోజు నుంచి అమలులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం రైతుకు చేరాలని నిర్ణయించారు. రైతు భరోసా పథకం కౌలు రైతులకు వర్తింప చేయనున్నట్లు తెలిపారు. చట్ట సవరణ చేసి కౌలు రైతులకు కార్డులు, పంట రుణాలు వెంటనే అందించాలని నిర్ణయించారు. ఇందుకు కౌలు రైతుల చట్టం అన్న పేరు కాకుండా భూమి కౌలు పేరిట చట్టం తీసుకు వచ్చే కసరత్తు సాగుతోంది.
లక్షలమంది రైతులకు ప్రయోజనం
కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించడంతో ఆరు లక్షల మంది కౌలు రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం లభించనుంది. సాగు చేసే ప్రతి రైతుకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వం సంకల్పమని వైసీపీ చెబుతోంది. అందులో భాగంగా రైతులతో సమానంగా కౌలుదారులకు కూడా సాగుతో పాటు ఇతర హక్కులు, ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా రైతు భరోసా ఇవ్వనున్నారు. రెవెన్యూ నివేదిక ప్రకారం ఆరు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. గతంలో 4.33 లక్షల మంది రైతులకు కౌలు రుణ అర్హత గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1.60 లక్షల మందికి పైగా వచ్చాయి. ఉభయ గోదావరి జిల్లాలోనే దాదాపు మూడున్నర లక్షలమంది కౌలు రైతులు ఉన్నారు.
దానికి రూ.1,700 కోట్లు అవసరం
వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు 60 శాతం ఫీడర్లలోనే 9 గంటల పాటు చొప్పున ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితులు ఉండగా, మిగిలిన 40 శాతం పీడర్లలో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.1,700 కోట్లు అవసరం. ఇందుకు అవసరమయ్యే నిధులు సేకరిస్తున్నారు. ఈ మొత్తంతో వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు బలోపేతం చేయనున్నారు.
పలు అంశాలపై చర్చ
కాగా, వ్యవసాయ మిషన్ భేటీలో పలుఅంశాలపై చర్చించారు. కొరత లేకుండా వచ్చే ఏడాది నుంచి విత్తన సేకరణ, అనంతపురం వంటి జిల్లాల్లో వేరుసెనగ బదులు ప్రత్యామ్నాయ చిరు ధాన్యాలు, ఇతర పంటల సాగును ప్రోత్సహించే అంశాలపై దృష్టి సారించారు. నకిలీ విత్తనాలను అరికట్టడం, పురుగుల మందు నాణ్యత తనిఖీ కోసం ప్రతి నియోజకవర్గంలో టెస్ట్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వ్యవసాయ మిషన్లోని ప్రతి సభ్యుడు ఎప్పటికి అప్పుడు తెలుసుకొని, ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తారు. ప్రతి నెల వ్యవసాయ మిషన్ భేటీ అవుతుంది.
రూ.970 కోట్లు ఇస్తాం
రైతు భరోసా స్కీం కింద అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం రూ.12,500 చొప్పున ఇవ్వనున్నట్లు జగన్ చెప్పారు. రాష్ట్రంలో వందకు 50 శాతం మంది రైతులు 1.22 ఎకరాల లోపు పొలం ఉన్నవారని, ఈ పెట్టుబడి సాయం వారికి ఉపకరిస్తుందని, దీంతో పాటు ప్రభుత్వం వడ్డీలేని పంట రుణాలు ఇప్పిస్తుందని, రైతులకు ఇది ఉపయోగపడుతుందన్నారు. రైతులకు ప్రకటించిన రాయితీల్లో అవకతవకలు జరగవద్దన్నారు. ఒక సీజన్లో నష్టపోతే మరో సీజన్లో పంట వేసుకునేందుకు అందించేదే ఇన్పుట్ సబ్సిడీ అన్నారు. అలా అందేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం రైతులకు బకాయిపడ్డ రూ.2 వేల కోట్లకుపైగా ఇన్పుట్ సబ్సిడీ, ధాన్యం రైతులకు బకాయిపడ్డ రూ.970 కోట్లు ఇస్తామని, ధాన్యం రైతులకు ఇప్పటికే రూ.300 కోట్లు విడుదల చేశామని చెప్పారు.
బీమా పథకంలో కౌలు రైతుల పేర్లు చేర్చాలి..
పంట బీమా స్కీంలో కౌలు రైతుల పేర్లు నమోదు చేయాలని రైతు సంఘం నేతలు డిమాండ్ చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా కౌలు రైతులకు కార్డులు ఇవ్వడంతోపాటు పంటరుణ పరిమితి మేరకు వడ్డీలేని రుణాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు బకాయిలు చెల్లించడంతోపాటు కౌలు రైతులకు రుణమాఫీ అమలయ్యేలా చూడాలని కోరారు. గత ప్రభుత్వం బకాయిలు కూడా చెల్లించాలని కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించలేదని వాపోయారు.