నో పార్కింగ్లో వెహికిల్ ఆపితే రూ.23వేలు ఫైన్, ఈ రోజు నుంచే....
ముంబై: జూలై 7వ తేదీ నుంచి (నేటి నుంచి) ముంబైలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నో పార్కింగ్ చోట వాహనాలు పార్కింగ్ చేస్తే భారీగా జరిమానా వసూలు చేయనున్నారు. దీనిని బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్, ముంబై ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా అమలు చేస్తున్నారు. నో పార్కింగ్ జోన్లో వాహనం నిలిపితే రూ.5వేల నుంచి రూ.23 వేల వరకు జరిమానా విధిస్తారు.
ప్రభుత్వం ఇప్పటికే గుర్తించిన 26 పార్కింగ్ ప్రాంతాలు, బీఈఎస్టీఎస్ డిపోలను దాటిన 500 మీటర్ల తర్వాత నుంచి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి. మారిన నిబంధనల ప్రకారం బైక్స్ను రాంగ్ పార్కింగ్లో ఉంచితే రూ.5వేల నుంచి రూ.8,300 వరకు, భారీ వాహనాలకు రూ.15 వేల నుంచి రూ.23,250 వరకు ఫైన్ వేస్తారు. మీడియం వెహికిల్స్కు రూ.11,000 రూ.17,600 వరకు, లైట్ మోటార్ వెహికల్స్కు రూ.10వేల నుంచి రూ.15,100 వరకు జరిమానా విధిస్తారు. త్రీ వీలర్స్ వాహనాలకు రూ. రూ.8,000 నుంచి రూ.12,200 వరకు వసూలు చేస్తారు. లేట్ ఫీకి కూడా చార్జ్ విధించనున్నారు.

ఎక్కడ పడితే అక్కడ తమ వాహనాలను నిలుపుతుంటారని, దీంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని, ఇష్టం వచ్చినట్లు వాహనాలు నిలపకుండా ఉండేందుకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని బీఎంసీ అధికారి ఒకరు చెప్పారు.
ముంబైలో 30 లక్షల వాహనాల వరకు ఉంటాయని అంచనా. దీంతో జరిమానాలు విధించే సమయంలో వాహనదారులకు అధికారులకు మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో బీఎంసీ ఇప్పటికే ఎక్స్సర్వీస్ మెన్, ప్రయివేటు సెక్యూరిటీ గార్డులను నియమించింది.


Click it and Unblock the Notifications