ప్రయివేటీకరణ దిశగా...: బడ్జెట్లో ఎయిరిండియాకు కేవలం రూ.1 లక్ష కేటాయింపు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం లోకసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాకు తాజా బడ్జెట్లో కేవలం రూ.1 లక్షను కేటాయించారు. దీంతో ఎయిరిండియా ప్రయివేటీకరణకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తేలిపోయింది. ఈ సంస్ష విక్రయానికి ప్రభుత్వం రెండోసారి ప్రయత్నాలు చేస్తోంది. ఎయిరిండియా చీఫ్ అశ్వనీ లోహాని సంస్థలోని పదమూడు సంఘాలతో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రయివేటీకరణ, తదితర అంశాలపై ఆయన చర్చించనున్నారు.
రైల్వే టిక్కెట్ దాదాపు ఉచితం!!: SBI కార్డుతో ఇలా చేయండి...'
బడ్జెట్లో రూ.లక్ష కేటాయింపు
బడ్జెట్లో లక్ష రూపాయలు మాత్రమే కేటాయించడంతో... ఎయిరిండియాను విక్రయించాలని ప్రభుత్వం సిద్ధమైపోయిందని తేటతెల్లమైందని చెబుతున్నారు. ఎయిరిండియా విక్రయాన్ని తెరపైకి తెస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో చెప్పారు. మరోవైపు ఎయిరిండియా చైర్మన్, ఎండీ ఉద్యోగ సంఘాలతో సోమవారం ప్రయివేటీకరణ గురించి చర్చించేందుకు సిద్ధమయ్యారు. ఎన్డీయే ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే దీనిని విక్రయించేందుకు ప్రయత్నించింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు మరోసారి ప్రయత్నం చేస్తోంది.
ప్రయివేటీకరణ
ఈ బడ్జెట్లో విమానయాన శాఖకు రూ.4,500 కోట్లు కేటాయించారు. కానీ ఎయిరిండియాకు మాత్రం కేవలం రూ.1 లక్ష కేటాయింపులు జరిపారు. నివేదిక ప్రకారం గత ఏడాది ఎయిరిండియాకు ప్రభుత్వం నుంచి రూ.3,975 కోట్లు వచ్చాయి. మరోవైపు, ప్రయివేటు సంస్థలైన కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్ సంస్థలు మూతబడ్డాయని, అలాంటప్పుడు ప్రయివేటీకరణ సరికాదని ఎయిరిండియా యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ప్రయివేటీకరణ వల్ల సంస్థ లాభాలబాట పట్టదని తెలుసుకోవాలంటున్నారు.
FDI గాడినపడతాయా?
మరోవైపు, సివిల్ ఏవియేషన్ సెక్టార్లోకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ (FDI)ను కేంద్రం అనుమతిస్తోంది. ఇది ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్ వంటి సంస్థలకు ప్రయోజనకరం కానుందని కొంతమంది భావిస్తున్నారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాను వెనక్కి తీసుకునేందుకు మోడీ ప్రభుత్వం గతంలో ప్రయత్నించింది. ఇప్పుడు వంద శాతం వెనక్కి తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పుడు FDI సులభతరం వల్ల విమానయాన సంస్థలు గాడిన పడతాయని భావిస్తున్నారు.