యూకే కోర్టులో భారత్కు ఎదురుదెబ్బ: ప్లీజ్! డబ్బులు తీసుకోండి.. విజయ్ మాల్యా
లండన్: బ్యాంకుల నుంచి వేలకోట్ల రుణాలు తీసుకొని లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఊరట లభించింది. భారత్కు అప్పగింత కేసులో అప్పీల్కు అనుమతులిచ్చింది. మాల్యాను అప్పగించాలని వెస్ట్ మినిస్టర్స్ కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. యూకే హోమ్ కార్యదర్శి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిని సవాల్ చేసేందుకు కూడా అప్పుడే కోర్టు అనుమతించింది. దీంతో హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. తనను భారత్కు అప్పగించకుండా మాల్యా దాఖలు చేసిన పిటిషన్ని యూకే హైకోర్టు విచారణకు స్వీకరించింది.
దొంగ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు: ఆస్ట్రేలియాVsఇండియా మ్యాచ్లో మాల్యాకు షాక్
భారత్కు ఎదురుదెబ్బ
తనను భారత్కు అప్పగించేందుకు యూకే హోం సెక్రటరీ అయిదు కారణాలతో జారీ చేసిన ఉత్తర్వుల్లో కనీసం ఒకదానికైనా వ్యతిరేకంగా తన పిటిషన్ను అనుమతించాలని మాల్యా హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. మాల్యా తరఫున లాయర్ క్లారా మాంట్గోమరి వాదనలు వినిపించారు. జస్టిస్ జార్జ్ లెగ్గట్, జస్టిస్ ఆండ్రూ పొప్పెవాల్లతో కూడిన ధర్మాసనం అతని పిటిషన్ స్వీకరించింది. వెస్ట్ మినిస్టర్స్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి తీర్పుపై మాల్యా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, సాక్ష్యాలు పరిగణలోకి తీసుకునేలా ఉన్నాయని పేర్కొంది. దీంతో పిటిషన్ను విచారణకు లోబడి అనుమతించింది. ఇది భారత్కు ఓ విధంగా ఎదురుదెబ్బ.
న్యాయం జరుగుతుంది
వాదనల అనంతరం కోర్టు వెలుపల మాల్యా మీడియాతో మాట్లాడాడు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందనే భావన కలుగుతోందని, క్లీన్చిట్ వచ్చిందన్నంత సంతోషంగా ఉందని చెప్పాడు. కేసులో తాను పాజిటివ్గానే ఉన్నానని చెప్పాడు. ఆ తర్వాత ఆయన వరుస ట్వీట్లు చేశాడు.
|
దేవుడు గొప్పవాడు..
దేవుడు గొప్పవాడని, న్యాయం గెలుస్తుందని, యూకే హైకోర్టు ద్విసభ్య బెంచ్ తన పిటిషన్ను అంగీకరించిందని, తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని నేను పలుమార్లు చెప్పానని విజయ్ మాల్యా అన్నాడు. తనను ఎగతాళి చేసిన వారికి ఈ రోజు కోర్టు చెప్పిన తీర్పును చూడమని కోరుతున్నానని, తనపై సీబీఐ తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించాడు.
|
దయచేసి డబ్బులు తీసుకోండి
ఈ రోజు కోర్టులో తనకు ఊరట లభించినప్పటికీ, కింగ్ఫిషర్ ఎయిర్ లైన్స్కు చెందిన రుణాలు మొత్తం చెల్లిస్తానని తాను మరోసారి గుర్తు చేస్తున్నానని మరో ట్వీట్లో పేర్కొన్నాడు. దయచేసి డబ్బులు తీసుకోండని సీబీఐకి సూచించాడు. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు కూడా తాను మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.
నీరవ్ మోడీ మరిన్ని ఆస్తులు జఫ్తు
మరోవైపు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోడీకి ఉచ్చు బిగుస్తోంది. ఆయన కుటుంబానికి విదేశాల్లో ఉన్న ఆస్తులపై ఈడీ దృష్టి సారించింది. ఇప్పటికే పలు దేశాల్లోని ఆస్తులు జఫ్తు చేసింది. తాజాగా సింగపూర్లో నీరవ్ సోదరి పూర్వి, బావ మయాంక్ మెహతాకు చెందిన పెవిలియన్ పాయింట్ కార్పోరేషన్ కంపెనీకి సింగపూర్లో ఉన్న బ్యాంక్ ఖాతాల్లోని రూ.44.41 కోట్ల డిపాజిట్లను జఫ్తు చేసినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ అభ్యర్థన మేరకు 6.122 మిలియన్ డాలర్ల డిపాజిట్లను జఫ్తు చేయాలని సింగపూర్ హైకోర్టు ఆదేశించింది. వారం క్రితం స్విస్ బ్యాంకులో నీరవ్, పూర్వీలకు ఉన్న నాలుగు ఖాతాల్లోని రూ.283 కోట్ల డిపాజిట్స్ను జఫ్తు చేసింది. ఇప్పుడు సింగపూర్ ఆస్తులు జఫ్తు చేసింది.