RBI గుడ్న్యూస్: రేపటి నుంచి తగ్గుతున్న RTGS, NEFT ఛార్జీలు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొద్ది రోజుల క్రితం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. జూలై 1వ తేదీ నుంచి ఆన్లైన్లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టం (RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సుఫర్ (NEFT) ద్వారా జరిపే ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు ఉండవని ఆర్బీఐ జూన్ 6వ తేదీన ప్రకటించింది. బ్యాంకులు కూడా వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేయవద్దని, అదే రోజు నుంచి కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని బదలీ ఆదేశించింది.
RTGS, NEFT ట్రాన్సాక్షన్ల పైన రేపటి నుంచి ( సోమవారం, జూలై 1వ తేదీ) ఆర్బీఐ నుంచి ఎలాంటి ఛార్జీలు ఉండవు. సాధారణంగా RTGS, NEFT ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లపై కనీస ఛార్జీలు వసూలు చేస్తుంది దీంతో బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు ఛార్జీ విధిస్తాయి. అయితే ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత, నగదు చలామణి తగ్గించడం, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహానికి RTGS, NEFT ఛార్జీలు రద్దు చేయాలని నిర్ణయించింది. వీటిని ఉపయోగించే వారికి ఈ ఛార్జీల ఉపయోగం ఎంతో ప్రయోజకరం. అంతేకాకుండా, ఛార్జీలు రద్దు చేయడం వల్ల మరింతమంది RTGS, NEFT ద్వారా ట్రాన్సుఫర్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు.

ఇప్పటి వరకు ఎస్బీఐ నెఫ్ట్ ఛార్జీల పైన రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్టీజీఎస్ పైన రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేసింది. మిగతా బ్యాంకులు కూడా కాస్త, అటు ఇటుగా ఇంతే వసూలు చేశాయి. సోమవారం నుంచి ఆర్బీఐ ఛార్జీలు విధించడం లేదు.
ఆర్బీఐ ఆర్టీజీఎస్, నెఫ్ట్ పైన ఛార్జీలు రద్దు చేయడంతో బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలీ చేస్తాయి. దీంతో బ్యాంకులు ఎంతోకొంత వసూలు చేసినా, ఛార్జీలు మాత్రం చాలా చవక కానున్నాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్ను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం బాగుందని, దీంతో బ్యాంకులు కూడా ఆర్టీజీఎస్, నెఫ్ట్ పైన తమ కస్టమర్లకు ఛార్జీలు తగ్గించుతాయని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్ సునీల్ మెహతా అన్నారు.
జూన్ నెల మొదటి వారంలో ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష అనంతరం రెపో రేటు తగ్గించడంతో పాటు ఏటీఎం ఛార్జీల తగ్గింపుపై కమిటీని వేస్తామని చెప్పింది. అలాగే, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
'డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్ను ఉపయోగిస్తే వసూలు చేసే ఛార్జీలను ఎత్తివేస్తున్నాం. బ్యాంకులు దీనిని అమలు చేయాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛార్జీలను ఎత్తివేసిన ఫలాలను అన్ని బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు అందించాలి. ఇందుకు సంబంధించిన ఆదేశాలను బ్యాంకులకు వారం రోజుల్లో పంపిస్తాం' అని ఆర్బీఐ తన ప్రకటనలో అప్పుడు తెలిపింది.
ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ కోసం ఆర్టీజీఎస్, రూ. 2లక్షల వరకు నగదు లావాదేవీల కోసం ఎన్ఈఎఫ్టీని ఉపయోగిస్తాం. కాగా, ఇంతకుముందు ఆర్టీజీఎస్ సమయాన్ని ఆర్బీఐ గంటన్నర పాటు పొడిగించింది. ఇది జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. అంతకుముందు ఆర్టీజీఎస్ సమయం సాయంత్రం గం.4.30 వరకు ఉంది. ఆర్బీఐ దీనిని సాయంత్రం గం.6.00 వరకు పొడిగించింది. ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్కు రాత్రి గం.7.45 వరకు పొడిగించింది. ఇప్పటికే సమయాన్ని పెంచి కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఆర్బీఐ.. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ తెలిపింది.


Click it and Unblock the Notifications


