భారత్ అధిక టారిఫ్లపై మరిన్ని చర్యలు: అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్: అన్ఫెయిర్ ట్రేడ్ అంటూ భారత్ పైన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గత కొంతకాలంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు కూడా పరస్పరం పలు దిగుమతులపై టారిఫ్ను పెంచాయి. ఎంతోకాలంగా భారత్కు కల్పించిన జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (GSP) ప్రయోజనాలను అమెరికా ఇటీవలే తొలగించింది. మరోవైపు ట్రంప్ సహా అగ్రదేశ అధికారులు భారత్ టారిఫ్ పైన ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో భారత్ తీవ్రంగానే స్పందించింది. ట్రంప్ అనంతరం తాజాగా, యూఎస్ రిప్రజెంటేటివ్ రాబర్ట్ లిగ్జెర్ కూడా భారత్పై ఆగ్రహించారు.
నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.1కోటి సంపాదన!
GSP కారణంగా దశాబ్దాలుగా భారత్ భారీ ప్రయోజనాలు పొందిందని ఆయన వ్యాఖ్యానించారు. 2017లో 5.7 బిలియన్ డాలర్ల విలువ కలిగిన ఉత్పత్తులు టారిఫ్ లేకుండా దిగుమతి అయ్యాయన్నారు. భారత్కు జీఎస్పీ కారణంగా తాము చాలాకాలంగా నష్టపోతున్నామని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు అమెరికా రైతులకు, అమెరికా వ్యాపారులకు మంచి అవకాశమని చెప్పారు. జీఎస్పీ కారణంగా తమకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వీటిని పలుమార్లు గత కొన్ని నెలలుగా లేవనెత్తుతున్నామని చెప్పారు.
భారత్ నుంచి ఇతర అన్ఫెయిర్ యాక్షన్స్ పైన దృష్టి సారించామని చెప్పారు. అలాంటివి తమను విసిగిస్తున్నాయన్నారు. కాబట్టి వాటిపై కూడా దృష్టి సారించి సరైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం భారత్లో కొత్త ప్రభుత్వం ఉందని, అదే నాయకుడు (నరేంద్ర మోడీ) మళ్లీ ఎన్నికయ్యారని, అయితే కొత్త ప్రభుత్వంతో కొద్ది రోజుల్లో తాము మాట్లాడుతామని చెప్పారు. చర్చలు ముందుకు సాగుతాయని భావిస్తున్నామన్నారు. మిగతా దేశాల కంటే భారత్ టారిఫ్ ఎక్కువగా ఉందన్నారు.
భారత్ - అమెరికా మధ్య మంచి వాణిజ్య, మిలిటరీ సంబంధాలు ఉన్నాయన్నారు. G20 సమ్మిట్లో ట్రంప్.. ప్రధాని నరేంద్ర మోడీతో కలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అంతకంటే ముందే యూఎస్ సెక్రటరీ పాంపియో భేటీ కానున్నారని చెప్పారు. ఇరుదేశాల మధ్య గల సమస్యలపై చర్చిస్తామన్నారు.