ఎలక్ట్రిక్ వాహనాలపై మరో గుడ్న్యూస్!: జీఎస్టీ తగ్గింపు, సినిమా హాళ్లకు ఈ-టిక్కెట్
ఎలక్ట్రిక్ వెహికిల్స్ (విద్యుత్ ఆధారిత -EV) వాహనాలపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ సమయంలో ఛార్జీలు మినహాయించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ రోజు (21 జూన్) జీఎస్టీ కౌన్సెల్ భేటీ ఉంది. ఈ భేటీలో ఎలక్ట్రిక్ వెహికిల్స్ను తక్కువ శ్లాబ్లోకి తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు.
నో రిజిస్ట్రేషన్ ఫీజు... ఎలక్ట్రిక్ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాహనాలపై జీఎస్టీ 12 శాతంగా ఉంది. దీనిని 5 శాతం శ్లాబ్లోకి తీసుకు వచ్చే అవకాశాన్ని నేటి జీఎస్టీ మండలి 35వ సమావేశం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ వెహికిల్స్ 28 శాతం శ్లాబ్లో ఉన్నాయి. ఆర్థిక మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఇది మొట్టమొదటి జీఎస్టీ మండలి సమావేశం.
పన్ను ఎగవేతల నియంత్రణకు సంబంధించి పలు కీలక చర్యలు చేపట్టే అవకాశముంది. రూ.50 కోట్ల కంటే అధిక టర్నోవర్ కలిగిన సంస్థలు విక్రయించే వాటిపై ఖచ్చితంగా ఈ ఇన్వాయిస్ ఉండాలని, అన్ని సినిమా హాళ్లలో ఖచ్చితంగా ఈ టిక్కెటింగ్ ఉండాలే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరే అవకాశం కూడా ఉంది. ల్యాటరీపై విధించే జీఎస్టీ రేటును కూడా నిర్ణయించే అవకాశముంది.
మరోవైపు ఎలక్ట్రిక్ ఛార్జీలను కూడా 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించే అవకాశాలు ఉన్నాయి. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎన్హెచ్ఏఐ ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థతో ఈ-వే బిల్లులు అనుసంధానం చేయనున్నారు. యాంటీ ప్రాఫిటింగ్ అతారిటీ కాలపరిమితిని మరో ఏడాది పాటు అంటే 2020 నవంబర్ వరకు పొడిగింపుపై చర్చించనున్నారు.