దొంగ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు: ఆస్ట్రేలియాVsఇండియా మ్యాచ్లో మాల్యాకు షాక్
లండన్: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రపంచ కప్లో భాగంగా లండన్లో జరిగిన ఆస్ట్రేలియా - భారత్ మ్యాచ్కు వచ్చాడు. అతను ఇండియన్ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. ఆయనను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇది సక్సెస్ అవుతోంది కూడా. త్వరలో ఆయనను భారత్కు రప్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు ఆయన వచ్చాడు. ఈ సందర్భంగా బ్రిటన్ కోర్టుల్లో భారత్కు తీసుకువచ్చే అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు విజయ్ మాల్యా సమాధానం దాటవేశాడు. తాను క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చానని చెప్పి వెళ్లిపోయాడు.
భారత్లోని బ్యాంకులకు వేలకోట్లను ఎగ్గొట్టిన కేసులో మాల్యా విచారణ ఎదుక్కొంటున్నారు. ఇటీవల డియాజియోతో వివాదం కేసులోనూ మాల్యాకు లండన్ హైకోర్టులో షాక్ తగిలింది. దీంతో ఈ కేసులో 135 మిలియన్ డాలర్లను బ్రిటన్కు చెందిన డియాజియో గెలుచుకొంది. దీనికి అదనంగా వడ్డీ, కోర్టు ఖర్చులు మాల్యా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇండియన్ బ్యాంకుల నుంచి మాల్యా దాదాపు 9వేల కోట్లకు పైగా రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించలేదు. ఈ మొత్తానికి సంబంధించిన భారత్లో దాఖలైన కేసుల విచారణ హాజరయ్యేలా అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే దిగువ కోర్టులో భారత్ నెగ్గింది. యూకే హోం సెక్రటరీ మాల్యాను అప్పగించేలా ఆదేశాలపై సంతకాలు చేశారు. దీనిపై మాల్యా అప్పీల్కు వెళ్లారు. జులై 2వ తేదీన దీనికి సంబంధించిన తీర్పు రానుంది.
మాల్యాకు ప్రేక్షకుల షాక్
భారత్ -ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వచ్చిన మాల్యాకు ప్రేక్షకులు షాకిచ్చారు. ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్లో మాల్యాకు వ్యతిరేకంగా అక్కడి ప్రేక్షకులు నినాదాలు చేశారు. మ్యాచ్ చూడటానికి దొంగ వచ్చాడని కేకలు వేశారు. చోర్... చోర్ అని ఎగతాళి చేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియం నుంచి మాల్యా తన తల్లి, కుమారుడితో కలిసి వెళ్తుండగా ఇది చోటు చేసుకుంది.