పదవీవిరమణ చేయనున్న విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ...విప్రో వారసుడు ఎవరో తెలుసా..?
బెంగళూరు: సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో సంస్థ అధినేత అజీమ్ ప్రేమ్జీ త్వరలోనే రిటైర్ కానున్నారా అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. జూలై 30వ తేదీన అజీజ్ ప్రేమ్జీ పదవీవిరమణ చేయనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం విప్రో ఐటీ కంపెనీకి అజీమ్ ప్రేమ్జీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మెన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అయితే జూలై 31 నుంచి ఐదేళ్ల పాటు ఆయన నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతారని విప్రో సంస్థ తెలిపింది. అంతేకాదు అజీమ్ ప్రేమ్జీ విప్రో సంస్థ వ్యవస్థాపకులు అని ఆ కంపెనీ బీఎస్ఈలో చేసిన ఫైలింగ్లో తెలిపింది.
ఇక అజీమ్ ప్రేమ్జీ తర్వాత వారసత్వాన్ని తన కుమారుడు రిషద్ ఏ ప్రేమ్జీ కొనసాగించనున్నట్లు కంపెనీ పేర్కొంది. జూలై 31 నుంచి రిషద్ ప్రేమ్జీ పూర్తి స్థాయి డైరెక్టరుగా బాధ్యతలు చేపడుతారని కంపెనీ వెల్లడించింది.2024 జూలై 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఇక కంపెనీ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న అబీద్అలీ నీముచావ్లా సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్గా తిరిగి నియమించడం జరుగుతుందని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నిర్ణయించారు. ఈ మార్పులన్నీ జూలై 31, 2019 నుంచి అమల్లోకి వస్తాయని బోర్డు స్పష్టం చేసింది.
తన సుదీర్ఘ ప్రయాణంలో తన పదవి తనకు ఎంతగానో తృప్తి కలిగించిందని అజీమ్ ప్రేమ్జీ తెలిపారు. భవిష్యత్తులో దాతృత్వ జీవితం గడపాలని తాను భావిస్తున్నట్లు అజీమ్ తెలిపారు. అంతేకాదు రిషద్ సమర్థవంతంగా కంపెనీని నడుపగలరనే పూర్తి విశ్వాసం తనకు ఉందని అన్నారు. అంతేకాదు తన కొడుకు కంపెనీని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి దాతృత్వం ఉన్న వ్యక్తిగా అజీమ్ ప్రేమ్జీ పేరు సంపాదించారు. అంతేకాదు భారత ఐటీకి సీజర్లాంటి వాడని ఐటీ ఇండస్ట్రీ అభివర్ణిస్తుంది. ఇక ప్రముఖ అంతర్జాతీయ పత్రిక టైమ్ 100 మంది ప్రభావం చూపగల వ్యక్తుల్లో ప్రేమ్జీకి కూడా చోటు కల్పించడం విశేషం. ఇలా 2004లో మరియు 2011లో ఈ గౌరవం అజీమ్ ప్రేమ్జీకి ఇచ్చింది టైమ్.