త్వరలో ATM ఛార్జీలు తగ్గే అవకాశం, కమిటీ వేయనున్న RBI
ATM (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్స్) ఇంటర్చేంజ్ ఫీజు ఛార్జీలను తగ్గించాలని చాలామంది కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఛార్జీలు తగ్గించే అంశంపై ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలో ఓ కమిటీని వేయనుంది. ఈ మేరకు గురువారం (మే 6) ప్రకటన చేసింది.
ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఈ రోజు ప్రకటించింది. ఇందులో రెపో రేటు పావు శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6 శాతం రెపో రేటు 5.75 శాతానికి చేరుకుంది. రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటును వరుసగా 5.50శాతం, 6శాతానికి సవరించింది. ఈ సందర్భంగా ఏటీఎం ఛార్జీల అంశంపై స్పందించింది.
ఏటీఎంల ఉపయోగం క్రమంగా పెరుగుతోందని, ఏటీఎం ఛార్జీలు, ఫీజులు సమీక్షించాలనే డిమాండ్స్ ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఓ కమిటీని వేయాలని నిర్ణయించామని ఆర్బీఐ తెలిపింది. ఇందులో స్టేక్ హోల్డర్స్కు చోటు కల్పిస్తామన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
మరో గుడ్న్యూస్.. ఇక ఆ ఛార్జీలు ఉండవ్: NEFT, RTGS ఛార్జీలు ఎత్తివేత
ఈ కమిటీ తమ సూచనలను, సలహాలను తమ మొదటి సమావేశం తర్వాత... రెండు నెలల్లో ఇవ్వాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆ కమిటీ ఇచ్చిన సూచనలకు ఆ తర్వాత వారం రోజుల్లో కూర్పు తీసుకు వస్తామని తెలిపింది.
ఇదిలా ఉండగా, 2010 జులై తర్వాత రెపో రేటు 5.50 శాతంగా ఉండగా ఆ తర్వాత ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇప్పుడే. వడ్డీరేట్ల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి. హెచ్డీఎఫ్సీ, కొటక్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.