ప్రపంచంలోనే తొలి QLED 8K టీవీ, ధర వింటే షాకవుతారు!
న్యూఢిల్లీ: శాంసంగ్ భారత్లో కొత్త టీవీలను తీసుకు వచ్చింది. అత్యాధునిక టెక్నాలజీతో ప్రీమియం కస్టమర్ల కోసం ఖరీదైన టీవీలను మంగళవారం లాంచ్ చేసింది. అల్ట్రా ప్రీమియం QLED 8K టీవీ పేరుతో ఈ స్మార్ట్ టీవీను తెచ్చింది. వీటి ధరలు దాదాపు రూ.11 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉన్నాయి.
HD తెరలతో పోలిస్తే 33 మిలియిన్స్ పిక్సెల్స్తో 16 రెట్లు స్పష్టత, అల్ట్రా హై డెఫినేషన్ టీవీలతో పోలిస్తే 4 రెట్ల రెజొల్యూషన్, ఎక్కువ క్లారిటీ ఉంటుందని కంపెనీ చెబుతోంది. 65, 75, 82, 98 ఇంచుల టీవీలను తీసుకు వచ్చింది.
75 ఇంచుల టీవీ 10,99,900, 82 ఇంచుల టీవీ 16,99,900, 98 ఇంచుల వేరియంట్ టీవీ ధర రూ.59,99,900గా ఉంది. 65 ఇంచుల టీవీలు జూలై నెలలో అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర త్వరలో ప్రకటించనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది.
బిగ్ స్క్రీన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత స్పష్టత కలిగిన QLED టీవీలను శాంసంగ్ ఆవిష్కరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా క్వాంటమ్ ప్రాసెసర్తో పని చేసే 8K రిసొల్యూషన్ కలిగిన LED టీవీలను తీసుకు వచ్చింది. టీవీల మార్కెట్లో శాంసంగ్ వాటా 30 శాతంగా ఉంది. అక్టోబర్ - నవంబర్ నాటికి మరో నాలుగు శాతం పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు, శాంసంగ్ నోట్బుక్ 7, నోట్బుక్ 7 ఫోర్స్ పేరిట రెండు ల్యాప్టాప్స్ను అమెరికా మార్కెట్లో విడుదల చేసింది.