తాజాగా అధికార పగ్గాలు చేపట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి మొట్టమొదటి షాక్ స్వాగతం చెప్పింది. భారత దేశ వృద్ధి రేటు (జీడీపీ)ఐదేళ్ల కనిష్టానికి దిగొచ్చింది. జనవరి- మార్చి త్రైమాసికంలో జీడీపీ కేవలం 5.8 శాతానికి పరిమితం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ నీరసించడమే ఇందుకు కారణమని ప్రభుత్వం చెబ్తోంది. వృద్ధి రేటు ఆరు శాతం కంటే దిగువకు పడిపోవడం ఐదేళ్లలో ఇదే మొదలు.
17 క్వార్టర్స్ తర్వాత జీడీపీ ఈ స్థాయిలో పతనం కావడం ఆర్థిక రంగాన్ని కొద్దిగా కలవరానికి గురచేస్తోంది. అయితే ఇది తాత్కాలికమేనని, అంత ఆందోళన అక్కర్లేదనేది ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు చెబ్తున్న మాట.

మోడీ ముందున్న సవాల్
వృద్ధిరేటు మందగించడం నిజంగా ఈ ప్రభుత్వానికి సవాల్ లాంటిది. ఈ దశలో ప్రభుత్వం, ఆర్బీఐ.. రెండూ కలిసి ఆర్థిక వ్యవస్థలోకి భారీగా నిధులను కుమ్మరించడంతో పాటు ప్రోత్సాహకాలన ఇవ్వడం, వడ్డీ రేట్లను తగ్గించడం వంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా వినియోగం తగ్గడం, అమెరికా - చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ వాతావరణం కూడా కారణమనేది ప్రభుత్వ వాదన. ప్రధానంగా ఉత్పత్తి రంగంలో క్షీణత ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం.
గత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 8.2 శాతం, రెండో క్వార్టర్లో 7.1 శాతం, మూడో క్వార్టర్లో 6.6 శాతంగా నమోదైంది దేశ వృద్ధి రేటు. ఇప్పుడు ఏకంగా 5.8 శాతానికే పరిమితమైంది. దీనికి తోడు ఈ ఆర్థిక ఏడాదిలో జీడీపీవృద్ధి అంచనాను 7 నుంచి 6.8 శాతానికి తగ్గించింది అర్థగణాంక శాఖ.


Click it and Unblock the Notifications