రూ.899కే టికెట్ ధరలను ప్రకటించిన ఆ విమానాయాన సంస్థ
దేశీయ విమానాయాన సంస్థ గోఎయిర్ తమ ప్రయాణికుల కోసం భారీగా టికెట్ ధరలపై డిస్కౌంట్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా గోఎయిర్లో ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రారంభ టికెట్ ధరలను రూ.899గా ప్రకటించింది. అయితే 10 లక్షల టికెట్లు మాత్రమే విక్రయిస్తున్నట్లు తెలిపింది గోఎయిర్ సంస్థ. మే 27 నుంచి మే 30 వరకు ఈ టికెట్లను విక్రయించడం జరుగుతుందని తెలిపింది. ఇక ఈ సమయంలో టికెట్లను కొన్న వారు జూన్ 15 నుంచి డిసెంబర్ 31 మధ్య ప్రయాణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
జూన్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. పెరుగుతున్న విమాన టికెట్ ధరలపై ప్రతిఒక్కరూ పెదవి విరుస్తున్న నేపథ్యంలో అతి తక్కువ ధరలకే టికెట్ అందిస్తున్న సంస్థ గోఎయిర్ అని చెప్పారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జెహ్ వాడియా. ఇక ఈ భారీ డిస్కౌంట్లతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ను కూడా గోయిర్ సంస్థ ప్రకటించింది.
పేటీఎం ద్వారా టికెట్ కొనుగోలు చేసిన వారికి వెంటనే రూ.500 క్యాష్బ్యాక్ ఇస్తున్నట్లు తెలిపిన యాజమాన్యం, కనీస ధర 2,499గా ఉండాలని పేర్కొంది. రూ.1999 రూపాయలతో టికెట్ కొంటే పదిశాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.దీంతో పాటు అనేక ఆఫర్లను గోఎయిర్ విమానాయాన సంస్థ అందిస్తోంది. ప్రస్తుతం గోఎయిర్ సంస్థ 270 విమానాలను నడుపుతోంది. ఇందులో అంతర్జాతీయ సర్వీసులు కూడా ఉన్నాయి.