రాజకీయాల్లోకి వస్తే నన్ను వదిలేస్తానని నా భార్య చెప్పింది: రఘురాం రాజన్, మంత్రి పదవిపై...
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లారు. తాను రాజకీయాల్లోకి వస్తే తన భార్య తనను వదిలేస్తుందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే ఆయనకు కీలక పదవి దక్కనుందనే వార్తలు కూడా కొద్ది రోజుల క్రితం వచ్చాయి. వీటిపై ఆయన స్పందించారు.
విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టులో దొరకని తాత్కాలిక ఊరట
నేను రాజకీయాల్లోకి వస్తే నా భార్య వదిలేస్తానని చెప్పింది
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలేదని రఘురాం రాజన్ తేల్చి చెప్పారు. తన విలువైన సమయాన్ని కుటుంబం కోసం కేటాయిస్తున్నానని చెప్పారు. తాను ప్రస్తుతం వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా ఆసక్తికరంగా స్పందించారు. తనకు రాజకీయ అంశాల పట్ల ఆసక్తి ఉందని, కానీ ప్రత్యక్షంగా మాత్రం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మాత్రం లేదని చెప్పారు. తన భార్యకు కూడా అది ఇష్టం లేదన్నారు. ఒకవేళ ఆమె మాట కాదని రాజకీయాల్లోకి వస్తే తనను వదిలేస్తుందన్నారు. మీరు రాజకీయాల్లోకి వెళ్తే నేను వదిలేస్తానని తన భార్య సూటిగా చెప్పిందని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ గెలిస్తే కీలక పదవి వస్తుందనే ప్రచారంపై రాజన్ ఇలా
ప్రస్తుతం రాజకీయాలు అనే అంశం అంతటా సాధారణమైపోయిందని, కొంతమంది బాగా మాట్లాడి ఓట్లు సంపాదించుకుంటారని రఘురాం రాజన్ చెప్పారు. తనకు ఆ శక్తి లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు కీలక మంత్రి పదవి దక్కుతుందని చాలా ఊహాగాలను వస్తున్నాయని, అలాంటి ప్రచారాన్ని తాను ఆపలేనని చెప్పారు. తాను ఎక్కడ ఉంటే అక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటానని చెప్పారు. బలమైన కారణం ఏదీ లేనప్పటికీ రాజకీయాలపై మాత్రం ఆసక్తి లేదని చెప్పారు. తాను ఏ పార్టీకి మద్దతుగా ఉండనని, తన రచనలు అన్ని పార్టీలకు అతీతంగా ఉంటాయని చెప్పారు. తనకు ఉద్యోగం అంటే ఇష్టమని చెప్పారు.
హ్యాపీగా ఉన్నా
ప్రస్తుతం తాను నిర్వర్తిస్తున్న విధులతో సంతోషంగానే ఉన్నానని, కాంగ్రెస్ తీసుకు వస్తోన్న కనీస ఆదాయ పథకంతో చాలా లాభాలు ఉన్నాయని చెప్పారు. పేదలకు నగదు అందజేయడం వల్ల వారికి కావాల్సినవి వారే తీసుకుంటారన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సంస్కరణలు అవసరమని చెప్పారు. నిరుద్యోగం భారత్ సమస్య అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇబ్బంది ఉందన్నారు. పెట్టుబడులు మనవైపు మళ్లేలా ఎందుకు ప్లాన్ చేయవద్దని ప్రశ్నించారు.