విజయ్ మాల్యా జల్సాలకు చెక్: నెల ఖర్చు 29,500 పౌండ్లకు తగ్గించేందుకు ఓకే
ఢిల్లీ: బ్యాంకుల్లో వేలకోట్లు అప్పులుచేసి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ డాన్ విజయ్ మాల్యాకు షాక్ మీద షాక్ తగులుతోంది. నిన్నటి వరకు రాజభోగాలు అనుభవించిన మాల్యా.. లండన్లోను ఆనందంగానే ఉన్నాడు. ఓ విధంగా ఇప్పటికీ అతను జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు అతని జల్సాలకు బ్రేక్ పడనుంది..
ఎస్బీఐ బ్యాంక్ కస్టమరా.. 5 ముఖ్యమైన ఛార్జీలు తెలుసుకోండి?
మాల్యా లగ్జరీ లైఫ్
విజయ్ మాల్యా తమ అప్పులు తీర్చకుండానే బ్రిటన్లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రిటన్ కోర్టుకు తెలిపింది. మాల్యా నిర్వహిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ యూకే పీఎల్పీ అకౌంట్స్కు సంబంధించిన 2,58,000 పౌండ్లను సీజ్ చేసేందుకు అనుమతించాలని కోరింది. దీనిపై మాల్యా తరఫు అడ్వోకేట్ మాట్లాడుతూ.. తమ క్లయింట్ ప్రస్తుతం వారానికి 18,300 పౌండ్లు ఖర్చు చేస్తున్నారని, ఈ ఖర్చును నెలకు 29,500 పౌండ్లకు తగ్గించేందుకు అంగీకరించారని తెలిపారు. దీంతో మాల్యా పది రోజులకు చేస్తున్న ఖర్చుతో ఇక నుంచి నెల మొత్తం గడపాల్సి ఉంది.
ఎస్పీఐ ఏం చెప్పిందంటే?
విజయ్ మాల్యా ఇప్పటికీ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని ఎస్బీఐ లాయర్లు కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో పేర్కొన్నారు. మాల్యాను చూస్తుంటే ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని తెలుస్తోందని పేర్కొన్నారు. మాల్యాకు కింగ్ఫిషర్ బీర్ యూరప్ లిమిటెడ్ నుంచి ప్రతినెలా 7500 పౌండ్ల ఆదాయం సహా ట్రస్టుల ద్వారా నడుస్తున్న కుటుంబ ఆస్తుల నుంచి కూడా ఆయనకు భారీగా ఆదాయం వస్తోందని కూడా అందులో పేర్కొన్నారు. దీంతో మాల్యా ఖర్చు తగ్గించేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఎన్నో వ్యాపారాలు
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రుణాలను చెల్లించేందుకు విజయ్ మాల్యా ఉద్దేశపూర్వకంగానే నిరాకరిస్తున్నాడని బ్యాంకులు ఆరోపిస్తున్నాయి. గత ఇరవై ఏళ్లలో మాల్యా రియల్ ఎస్టేట్, యాచెస్, స్కాచ్ విస్కీ, ఫార్ములా వన్, యునైటెడ్ బ్రేవరీస్, ఐపీఎల్ ఫ్రాంచైజీ సహా ఎన్నో వ్యాపారాలు చేశాడు. లగ్జరీ లైఫ్ కొనసాగించాడు.