ఈ-బైక్ ధర రూ.29,999 మాత్రమే, ప్రత్యేకత ఇదే
బ్రిటన్కు చెందిన ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ సంస్థ గో-జీరో మొబిలిటీ భారత మార్కెట్లోకి తన బైక్స్ను ప్రవేశపెట్టింది. రెండు రకాల ఎలక్ట్రిక్ బైక్స్ను అందుబాటులోకి తెచ్చింది. మైల్, వన్ పేర్లతో ఈ రెండు విద్యుత్ బైక్లను బుధవారం ప్రవేశపెట్టింది.
ఇందులో మైల్ బైక్ ధర రూ.29,999 కాగా, వన్ ధర రూ.32,999గా ఉంది. వన్ బైకులో ఉన్న 400 వాట్ల లిథియమ్ బ్యాటరీని ఒక్కసారి రీచార్జి చేస్తే 60 కి.మీ., అలాగే మైల్ బైకులో ఉన్న 300 వాట్ల లిథియమ్ బ్యాటరీతో 45 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.
ఈ బైక్ను దేశీయంగా తయారు చేయడానికి కోల్కతా కేంద్రస్థానంగా విధులు నిర్వహిస్తున్న కీర్తి సోలార్తో చేతులు కలిపింది. ఈ బైక్స్ను భారత్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల కోసం రూపొందించినట్లు తెలిపారు.
సెట్ టాప్ బాక్స్ మార్చకుండానే ఆపరేటర్ను మార్చవచ్చు!
ఈ సందర్భంగా గో-జీరో మొబిలిటీ సీఈవో అంకిత్ కుమార్ మాట్లాడారు. విద్యుత్తో నడిచే వాహనాలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడం సంతోషంగా ఉందని, ముఖ్యం గా ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉంటుందని చెప్పారు. తాము తెచ్చిన రెండు ఈ -బైక్స్ భారత్, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా దేశాల కోసం అన్నారు.
మొదటి సంవత్సరంలో మూడు వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, రానున్న అయిదేళ్లలో 75 వేల యూనిట్లకు పెంచడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రెండు మోడళ్లతో పాటు డెలివ్ ఆర్, వన్ డబ్ల్యూ, జిరో స్మార్ట్ బైకులను కూడా అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. ఈ బైక్స్ను విక్రయించడానికి ప్రీమియం రిటైల్ అవుట్ లెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. తొలి విడతలో ఢిల్లీ, కోల్కతా, గౌహతిలో ప్రారంభిస్తామన్నారు.
వ్యాపార విస్తరణలో భాగంగా రానున్న మూడేళ్లలో 18 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కోల్కతాలో ఏర్పాటు చేసిన యూనిట్లో ఏడాదికి 20 వేల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నారు. కాగా, భవిష్యత్తులో విడుదల చేయబోయే ఉత్పత్తులను కూడా భారత్లోనే అభివృద్ధి చేసి తయారు చేయనున్నారు.