అన్నా, వదినలు ఆదుకున్నారు.. థ్యాంక్స్: ఫ్యామిలీ వ్యాల్యూపై అనిల్ అంబానీ
ముంబై: రిలయెన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్.కామ్) అధినేత అనిల్ అంబానీ.. ఎరిక్సన్కు బకాయిలు చెల్లించి జైలుకు వెళ్లకుండా పరువును నిలుపుకున్నారు. సుప్రీం కోర్టు విధించిన గడువుకు ఒక్కరోజు ముందు అనిల్ అన్నయ్య ముఖేష్ అంబానీ ఆర్థిక సాయం అందించడంతో స్వీడన్ టెలికాం పరికరాల తయారీ సంస్థకు రూ.550 కోట్లను చెల్లించారు. తనకు సాయం చేసిన అన్న ముఖేష్ అంబానీ, వదిన నీతా అంబానీలకు అనిల్ కృతజ్ఞతలు తెలిపారు.
ఎరిక్సన్ కంపెనీకి బకాయిలు, వడ్డీ, జరిమానాలతో సహా రూ.550 కోట్లు చెల్లించేందుకు సుప్రీం కోర్టు.. అనిల్కు ఈ రోజు (మార్చి 19వ తేదీ) వరకు గడువు ఇచ్చింది. నిధులు ఉన్నప్పటికీ, తమ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా బకాయిలను చెల్లించనట్లుగా గుర్తించామని, కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకుంటామని అనిల్ను ఫిబ్రవరిలోనే కోర్టు హెచ్చరించింది. మార్చి 19వ తేదీలోగా సెటిల్ చేసుకోవాలని లేదంటే ఆర్కామ్ ఛైర్మన్ అనిల్, ఆర్కామ్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ ఛైర్మన్ చాయా విరానీ, రిలయన్స్ టెలికాం ఛైర్మన్ సతీశ్ సేథ్లను కూడా జైలుకు పంపుతామన్నారు. దీంతో అన్నయ్య సాయంతో అనిల్ చెల్లించాల్సిన మొత్తం ఎరిక్సన్కు సోమవారం సాయంత్రం చేరింది.
అనిల్ అంబాని డబ్బులు చెల్లిస్తారా లేదా జైలుకు వెళతారా
ఆర్కాం నెట్ వర్క్ను ఏడేళ్ల పాటు నిర్వహించేందుకు 2013లో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం మేరకు నిధులు చెల్లించడం లేదని, తమకు రూ.1600 కోట్ల వరకు రావాల్సి ఉందని ఎరిక్సన్ దివాళా కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ఎన్సీఎల్టీ (జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్) నుంచి ఎన్సీఎల్ఏటీ (జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్)కు చేరింది. అక్కడి నుంచి సుప్రీం కోర్టుకు వెళ్లింది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన, ఆ తర్వాత డిసెంబర్ 15వ తేదీన బకాయి చెల్లింపుకు గడువు ఇచ్చారు. కానీ చెల్లించలేదు. ఇప్పుడు చెల్లించారు.
'క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన తన అన్నయ్య ముఖేష్ అంబానీ, వదిన నీతా అంబానీకి మనస్ఫూర్తిగా ధనన్యవాదాలు చెబుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో తనకు అండగా నిలవడం ద్వారా బలమైన తమ కుటుంబ విలువలకు ఇచ్చే ప్రాముఖ్యత వెల్లడైంది' అని అనిల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆస్తుల విక్రయం కోసం ముఖేష్కు చెందిన రిలయెన్స్ జియోతో, అనిల్కు చెందిన ఆర్కామ్ పదిహేను నెలల క్రితం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. ఈ మేరకు ఇరు కంపెనీలు ప్రకటించాయి. ప్రభుత్వంతో పాటు రుణదాతల నుంచి అనుమతుల్లో జాప్యం జరగడమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి.