అనిల్ అంబాని డబ్బులు చెల్లిస్తారా లేదా జైలుకు వెళతారా
అనిల్ అంబానీకి టైమ్ అప్ చెప్పేందుకు కోర్టు సిద్ధమవుతోంది. ఎరిక్సన్కు ఆయన చెల్లించాల్సిన రూ.453 కోట్ల బకాయిలకు ఇంకా 24 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.సుప్రిం తీర్పు ప్రకారం 19 మార్చి లోగా ఎరిక్సన్ కు డబ్బులు చెల్లించాలి, లేదంటే మూడు నెలల పాటు జైలు శిక్ష వేసే అవకాశం ఉంటుంది. కాగా డబ్బులు చెల్లించడానికి ఇంకా రోజు మాత్రమే మిగిలి ఉంది. గతంలో ఎరిక్సన్కు బకాయిపడిన రూ.571 కోట్లలో కొద్దికాలం క్రితం ఆయన రూ.118 కోట్లను కోర్టులో ఇప్పటికే డిపాజిట్ చేశారు. అయితే దీనిపై ఎన్నిసార్లు కోర్టుకు రావాలని ఆదేశించినప్పటికీ అనిల్ అంబానీ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల గడువును ఇచ్చింది. ఆ గడువు మంగళవారంతో ముగియనుంది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ చెందిన రూ.260 కోట్ల ట్యాక్స్ రిఫండ్స్ ప్రస్తుతం ఎస్బీఐ దగ్గర ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలని అనిల్ అంబానీ అప్పిలేట్ ట్రైబ్యునల్ను అభ్యర్థించారు. అయితే దీనిపై తాము ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేమని ట్రైబ్యునల్ కొట్టిపారేసింది. కావాలనుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. జాతీయ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్కు వెళ్లిన అనిల్ అంబానీ ఎస్బీఐ సహా 37 మంది రుణదాతలకు రూ.260 కోట్ల నిధుల విడుదల చేసేందుకు ఆదేశాలు ఇవ్వమని కోరింది. అయితే ఇది షేర్ హోల్డర్ల సొమ్మని, దీన్ని వ్యక్తిగతంగా ప్రైవేట్ పార్టీకి చెల్లించేందుకు తాము సిద్ధంగా లేమని రుణదాతలంతా తేల్చిచెప్పేశారు. దీంతో జూనియర్ అంబానికి ఉన్న ఆ దారి కూడా మూసుకుపోయింది.
అనిల్ అంబానికి మరిన్ని కష్టాలు
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దివాలా ప్రక్రియ (కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016)కు కంపెనీ వెళ్లకుండా చూసుకోవాలని ట్రైబ్యునల్ కోరింది. ఎందుకంటే ఒక వేళ ఈ వ్యవహారం సదరు శాఖకు వెళ్తే రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. ఆస్తులను అమ్ముకుని బకాయిలు తీర్చేందుకు మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రక్రియలో ఆస్తులను వేలం వేయగా వచ్చే డబ్బుల్లో ఎస్బీఐ వంటి సంస్థలకు మొదటి ప్రాధాన్యత దక్కుతుంది. ఎరిక్సన్ వంటి సంస్థలకు ఆఖరి అవకాశం ఉంటుంది. అందుకే వ్యవహారం అంత దూరం వెళ్లకుండా చూసుకోవాల్సిన రుణదాతలు భావిస్తున్నారు.