నాలుగో రోజూ లాభాల్లోనే ముగింపు ! అయినా నష్టాల్లో అధిక శాతం స్టాక్స్
తీవ్ర ఒడిదుడుకుల మధ్య చివరకు స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. ఆఖరి గంటలో వచ్చిన కొనుగోళ్ల మద్దతు నేపధ్యంలో నష్టాల్లో ఉన్న మార్కెట్లు లాభాల్లోకి చేరకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నిరుత్సాహక సంకేతాలతో 11078 పాయింట్ల దగ్గర ఫ్లాట్గా మొదలైన నిఫ్టీ మిడ్ సెషన్ వరకూ ఎలాంటి చలనం లేకుండా ఉంది. అయితే కేబినెట్ నిర్ణయాల నేపధ్యంలో ఒక్కసారిగా కొనుగోళ్లు జోరందుకున్నాయి. నష్టాల్లోకి జారుకున్న మార్కెట్ కాస్తా లాభాల్లోకి చేరి ఫ్లాట్గా క్లోజైంది. చివరకు కేవలం 6 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11058 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 36725 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ సుమారు 140 పాయింట్లు పెరిగింది.
ఫోక్స్వ్యాగన్కు జాతీయ హరిత ట్రైబ్యూనల్ రూ. 500కోట్ల జరిమానా
రంగాల వారీగా..
పీఎస్లు బ్యాంక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసిజి రంగ కౌంటర్లలో బయింగ్ ఇంట్రెస్ట్ నమోదైంది. మీడియా, మెటల్, ఫార్మా, ఐటీ రంగ కౌంటర్లు నీరసించాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు అర శాతం వరకూ పతనమయ్యాయి. పేరుకు మార్కెట్ ఈ రోజు స్వల్ప లాభాల్లో ముగిసినప్పటికీ నష్టపోయిన షేర్ల జాబితానే ఎక్కువగా ఉంది. మూడు రోజుల వరుస లాభాల తర్వాత మార్కెట్లు ఈ రోజు కొద్దిగా కన్సాలిడేషన్ బాటలో నడిచాయి.
సుజ్లాన్ చల్లబడింది
ఐదు రోజుల వరుస ర్యాలీతో పరుగులు తీసి మార్కెట్ను ఆశ్చర్యపరిచిన సుజ్లాన్ ఈ రోజు నీరసించింది. వారం రోజుల్లోనే ఏకంగా డబుల్ అయిపోవడంతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అధిక శాతం లాభాలను స్వీకరించేందుకే మొగ్గుచూపారు. దీంతో ఈ స్టాక్ చివరకు 12 శాతం నష్టాలతో రూ.6.93 దగ్గర క్లోజైంది.
అవంతీ ఫీడ్స్ లాభాల బాట
రొయ్యలకు ఎరువు, ఆహారాన్ని తయారు చేసే రంగంలో ఉన్న అవంతీ ఫీడ్స్ స్టాక్ ఐదో రోజు కూడా లాభాల్లో ముగిసింది. 20 రోజుల యావరేజ్తో పోలిస్తే ట్రేడింగ్ వాల్యూమ్ ఏకంగా 10 రెట్లు పెరిగింది. చివరకు స్టాక్ 5.6 శాతం పెరిగి రూ. 406 దగ్గర క్లోజైంది.
లాభాల స్వీకరణ
గత మూడు రోజులుగా భారీ లాభాలతో దూసుకుపోయింది చాలా స్టాక్స్ ఈ రోజు నీరసించాయి. చాలా స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. వాటిల్లో ముఖ్యంగా లక్ష్మీ విలాస్ బ్యాంక్, జెకె బ్యాంక్, శంకర్ బిల్డ్కాన్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, దివాన్ హౌసింగ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కనీసం 5 శాతానికి తక్కువ లేకుండా నష్టపోయాయి.
షుగర్ షేర్స్ చేదు
చక్కెర రంగ షేర్లలో అధిక శాతం నష్టాల్లో ముగిశాయి. చెరకు రైతులను ఆదుకునేందుకు కేంద్రం షుగర్ కంపెనీలకు బకాయిపడిన మొత్తాన్ని విడుదల చేయబోతున్నాయి. వీటికి తోడు మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా కేబినెట్ తీసుకుంది. అయితే ఈ నిర్ణయాలు వెలువడకముందే ఈ రంగంలోని చాలా షేర్స్ ఎగిరి గంతేశాయి. తీరా న్యూస్ వచ్చాక మాత్రం అధిక స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. వాటిల్లో దాల్మియా, ద్వరికేష్, ఉత్తమ్, అవధ్, త్రివేణి, ధంపూర్ షుగర్ స్టాక్స్ 5 శాతానికిపైగానే నష్టపోయాయి. ఈఐడీ పారీ, ఆంధ్రా షుగర్స్ వంటి కొన్ని స్టాక్స్ మాత్రమే ఫ్లాట్గా ముగిశాయి.