న్యూఢిల్లీః దేశంలో యూజ్డ్ కార్ల విక్రయాలకు నానాటికీ డిమాండ్ భారీగా పెరుగుతోంది. కొత్త కార్లను కొనుగోలు చేయడం కంటే సెకెండ్స్, యూజ్డ్ కార్లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు వినియోగదారులు. ఆటోమొబైల్ రంగంలో మనదేశం ప్రపంచంలోనే మూడోస్థానంలో ఉంది. ఏటా 3000 కోట్ల రూపాయల మేర క్రయ, విక్రయాలు ఈ రంగంలో నమోదవుతుంటాయి. ఇ-కామర్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత వాహనాల విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. పెద్ద ఎత్తున సాగుతున్నాయి. కార్ల కొనుగోలులో ప్రపంచంలో అగ్ర దేశంలో ఎదుగుతోంది భారత్.
వ్యక్తిగత, వాణిజ్యేతర వాహనాల విభాగంలో అనేక రకాల కార్లు మార్కెట్లో విడుదల అవుతున్నాయి. అయినప్పటికీ.. ఇప్పటిదాకా ముగిసిన పండగ సీజన్లలో ఆశించిన స్థాయిలో కొత్త కార్ల కొనుగోళ్లు లేవు. అదే సమయంలో- యూజ్డ్ కార్ల మార్కెట్ భారీగా పెరిగింది. యూజ్డ్ కార్లను కొనుగోలు చేయడానికి జనం ఎగబడ్డారు.

2018లో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఎఎం) విడుదలచేసిన నివేదికల ప్రకారం.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో యూజ్డ్ కార్ల కొనుగోళ్లు భారీగా నమోదయ్యాయి. సుమారు 40 లక్షల యూజ్డ్ కార్లు అమ్ముడయ్యాయి. కొత్త కార్ల అమ్మకాలు 32 లక్షల మేర మాత్రమే నమోదు చేసుకున్నాయి. క్రిసిల్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. దేశంలో అమ్ముడయ్యే ప్రతి మూడింటిలో రెండు యూజ్డ్ కార్లేనని క్రిసిల్ వెల్లడించింది. యూజ్డ్ కార్ల అమ్మకాల్లో ఇదే రకమైన పురోభివృద్ధి కొనసాగితే.. 2020 నాటికి 15 శాతం మేర వృద్ధి నమోదవుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దేశవ్యాప్తంగా యూజ్డ్ కార్ల వినియోగం ఇంత భారీ ఎత్తున చోటు చేసుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. మార్కెట్ లో చోటు చేసుకుంటున్న మార్పులు దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. కార్ దేఖో, ఓఎల్ఎక్స్, డ్రూమ్, కార్స్ 24, మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వంటి కొత్త కొత్త ఇ-కామర్స్ సంస్థలు పుట్టుకుని రావడం వల్ల యూజ్డ్ కార్ల అమ్మకాల పరిధి విస్తృతమైందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకుని, కొనుగోలుదారులకు మరింత చేరువ కావడానికి, తమ బ్రాండ్ల అమ్మకాలు పెరగడానికి అవసరమయ్యే వాణిజ్య ప్రకటనలపై భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు యూజ్డ్ కార్ల డీలర్లు.
ఎంత భారీగా ఖర్చు చేస్తున్నాయంటే- 2016లో కార్ దేఖో సంస్థ యాజమాన్యం వాణిజ్య ప్రకటనలపై 62 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కార్ ట్రేడ్, కార్ వాలే సంస్థలు కూడా అదే ఏడాది సంయుక్తంగా 161 కోట్ల రూపాయలను అడ్వర్టయిజ్మెంట్ల కోసం వ్యయం చేశాయి. 2016లో డ్రూమ్ సంస్థ 20.6 కోట్ల రూపాయలను కేటాయించింది. గత ఏడాది డ్రూమ్ సంస్థ ఏకంగా 400 కోట్ల రూపాయలను తన మార్కెటింగ్ బడ్జెట్ గా ప్రకటించింది. ఇందులో 150 కోట్ల రూపాయలను డిజిటల్ మీడియా కోసం కేటాయించింది డ్రూమ్ సంస్థ యాజమాన్యం.
కొత్త కార్లతో పోల్చుకుంటే యూజ్డ్ కార్లను కొనుగోలు చేయడానికే వినియోగదారులు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? ప్రీ ఓన్డ్ కార్ల ధరలు అందుబాటులో ఉండటం ఓ ప్రధాన కారణమని ఓఎల్ఎక్స్ గ్రూప్ ఆటో కేటగిరీ విభాగం ఉపాధ్యక్షుడు సన్నీ కఠారియా వెల్లడించారు. కొత్త కార్లతో పోల్చుకుంటే ప్రీ ఓన్డ్ కార్ల ధరలు 20 నుంచి 30 శాతం తక్కువగా ఉంటాయని తమ డేటా చెబుతోందని కఠారియా అన్నారు. కొత్త కార్ల యజమానులు రెండు, మూడేళ్ల తరువాత తమ కార్లను చెప్పుకోదగ్గ డిస్కౌంట్ ఇచ్చి, ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెడుతున్నారని, కొద్దిరోజులుగా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని చెప్పారు. తరచూ కొత్త మోడళ్లు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయని, వాటిని కొనుగోలు చేయడానికి కొత్త కార్ల యజమానులు ఆసక్తి చూపడం కూడా దీనికి ఓ కారణమని కఠారియా అభిప్రాయపడ్డారు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఓఎల్ఎక్స్ సంస్థ యాజమాన్యం తన వ్యాపార పరిధిని మరింత విస్తృతం చేసుకోనుంది. ఆఫ్ లైన్ రూపంలో యూజ్డ్ కార్ల మార్కెట్ను విస్తృతం చేసుకోవడంలో భాగంగా ఆ సంస్థ దేశవ్యాప్తంగా 2021 నాటికి 40 నగరాల్లో 150 అవుట్లెట్లను నెలకొల్పడానికి ప్రణాళికలు రూపొందించింది.
యూజ్డ్ కార్ల విభాగంలో ఇంత భారీ ఎత్తున వాణిజ్య ప్రకటన కోసం ఎందుకు ఖర్చు చేస్తున్నారని, ఈ రంగంలో ఉన్న అవకాశాలేమిటనే ప్రశ్నకు డ్రూమ్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి సందీప్ అగర్వాల్ సమాధానం ఇస్తూ- యూజ్డ్ కార్ల విభాగంలో 15 శాతం వరకు అమ్మకాలు కార్స్ 24, కార్ నేషన్, మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ వంటి వ్యవస్థీకృత ఇ-కామర్స్ , ఆన్లైన్ సంస్థల ద్వారా కొనసాగుతున్నాయని అన్నారు. మిగిలిన 85 శాతం యూజ్డ్ కార్ల అమ్మకాలు ఆయా సంస్థల పరిధిలోకి రావట్లేదని చెప్పారు. తమక తెలిసిన వ్యక్తులు, పరిచయస్తుల ద్వారా 85 శాతం యూజ్డ్ కార్ల అమ్మకాలు కొనసాగుతున్నాయని అన్నారు.
ద్విచక్ర వాహనాల విషయంలో 100 శాతం అమ్మకాలు ఈ రూపంలోనే సాగుతున్నాయని సందీప్ అగర్వాల్ వెల్లడించారు. ఆన్లైన్ విభాగంలో జరిగే ఆటోమొబైల్ అమ్మకాల్లో తాము అగ్రగామిగా ఉన్నామని, ఆఫ్ లైన్ లో మిశ్రమ స్పందన ఉందని అన్నారు. ఆఫ్లైన్ విభాగంలో మహీంద్రా ఫస్ట్ చాయిస్, కార్ నేషన్, మారుతి ట్రూ వేల్యూ, క్యాష్ మై కార్, కార్స్ 24 వంటి సంస్థలు మిశ్రమ ఫలితాలను సాధిస్తున్నాయని అన్నారు. దేశ జీడీపీలో 12 శాతం వరకు వాటా ఉన్న ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయని, అందుకే తాము వాణిజ్య ప్రకటనల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నామని సందీప్ అగర్వాల్ తెలిపారు.
ప్రస్తుతం దేశంలో యూజ్డ్ కార్ల అమ్మకాలు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నానని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. దేశంలో కొత్త కార్ల అమ్మకాల ద్వారా ఆటోమొబైల్ రంగం పురోగమనం ఏటా 10 శాతానికి లోపే ఉంటుందని, యూజ్డ్ కార్ల అమ్మకాలు మాత్రం 15 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాయని సందీప్ అగర్వాల్ విశ్లేషించారు. 2018లో వ్యక్తిగత, వాణిజ్యేతర వాహనాల మార్కెట్లో 34 లక్షల అమ్మకాలు నమోదు కాగా, ఇందులో ఓఎల్ఎక్స్ మాత్రమే 30 లక్షల కార్లను విక్రయించిందని ఆయన వివరించారు.
యూజ్డ్ కార్ల అమ్మకాల్లో ఎప్పటికప్పుడు నమోదవుతున్న వృద్ధి రేటు ఆధారంగానే తాము వాణిజ్య ప్రకటనలపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తామని మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ మార్కెటింగ్ విభాగాధిపతి ఎం సత్యనారాయణ తెలిపారు. బ్రాండ్లకు ఉన్న డిమాండ్, వాటికి ఉన్న విలువ ఆధారంగా అడ్వర్టయిజ్మెంట్లపై వ్యయం చేస్తామని అన్నారు.
38 లక్షల ప్రీ ఓన్డ్ కార్ల విక్రయాలు నమోదు కాగా, ఇందులో ఓఎల్ఎక్స్ ఒక్కటే 77 శాతం మార్కెట్ వాటాను ఆక్రమించిందని సత్యనారాయణ చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. పెద్ద ఎత్తున కార్ల విక్రేతలు ఆఫ్ లైన్ మీదే ఆధారపడిన విషయం స్పష్టమౌతోందని అన్నారు. 55 శాతం కార్ల అమ్మకాలు టయర్ వన్ నగరాల్లో, మిగిలిన 45 శాతం అమ్మకాలు టయర్ 2 నగరాల్లో చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. 2018లో మహీంద్రా ఫస్ట్ ఛాయిస్ 40 నుంచి 50 శాతం వృద్ది రేటును నమోదు చేసుకుందని మీడియాలో వచ్చిన కథనాలు వెల్లడిస్తున్నాయి. కొన్నేళ్లుగా చిన్న తరహా ఎస్యూవీ కార్లు అద్భుతమైన వృద్ధి రేటును నమోదు చేశాయి. చిన్న తరహా ఎస్యూవీలు 2023 నాటికి యూజ్డ్ కార్ల విభాగంలో రికార్డు స్థాయిలో అత్యధిక అమ్మకాలను సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏటా జీడీపీలో 12 శాతం వాటాను కలిగి ఉన్న లేదా ఏటా 3000 కోట్ల రూపాయల సామర్థ్యం ఉన్న ఆటోమొబైల్ రంగంలో తాము భాగస్వామ్యులయ్యామని అగర్వాల్ తెలిపారు. ఇందులో 125 కోట్ల రూపాయల మేర విక్రయాలు ఆన్లైన్ ద్వారా నమోదవుతున్నాయని, వచ్చే అయిదేళ్ల నాటికి 3000 కోట్ల రూపాయల లావాదేవీలు భారీగా పెరుగుతాయని, 4500 కోట్ల రూపాయలకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా అమ్మకాల్లో 200 కోట్ల రూపాయల మేర వృద్ధి రేటు నమోదవుతుందని అన్నారు.
యూజ్డ్ కార్ల విభాగంలో పురోభివృద్ధి ఇప్పటికీ 15 శాతం వృద్ధి రేటుతో నెమ్మదిగానే కొనసాగుతోందని అన్నారు. ద్విచక్ర వాహనదారులు కార్ల కొనుగోలు వైపు ఆసక్తి చూపితే అద్భుతాలు చోటు చేసుకుంటాయని సత్యనారాయణ తెలిపారు. దీని ఫలితంగా తొలిసారి కార్లను కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అన్నారు.
అభివృద్ధి చెందుతున్న ఇతర మార్కెట్ల తరహాలోనే ఆటోమొబైల్ రంగం కూడ శరవేగంగా పురోగమించాల్సి ఉందని కఠారియా అన్నారు. ఆప్ లైన్ ద్వారా తమ కార్లను విక్రయించే వారు ఆన్ లైన్ మార్కెట్ పై దృష్టి పెడితే వినియోగదారుల ప్రయాణం మరింత సుఖవంతం, వేగవంతం అవుతుందని చెప్పారు. ప్రీ ఓన్డ్ కార్లపై బీమా, ఫైనాన్స్ వంటి సౌకర్యాలను ప్రవేశపెట్టి వన్ స్టాప్ షాప్గా ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కఠారియా అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications