భారత్ జీఎస్టీపై ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్
దావోస్: భారతదేశంలో జీఎస్టీ అమలు ఇప్పుడు ఇప్పుడే గాడిన పడుతోందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ అన్నారు. దావోస్లో ఓ మీడియా ఛానల్తో మాట్లాడారు. భారత్లో పరోక్ష పన్నుల వసూళ్ల అంచనాల కంటే తక్కువగా వసూలు అవుతున్నాయని చెప్పారు. ఇది జీఎస్టీ తీసుకురావడంలో లేదా అమలులో గాని ఉన్న లోపాలకు సంకేతమని, దీనిని పరిష్కరించాలన్నారు.
దీంతో పాటు వ్యవసాయ రంగం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడ కూడా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. ఇది రుణమాఫీ రూపంలో ఉండకూడదని చెప్పారు. నగదు మద్దతు అవసరమే కానీ అది ఇన్పుట్ సబ్సిడీల రూపంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.
రైతులకు నగదు రూపంలో ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే రూ.70వేల కోట్ల వరకు అదనపు నిధులు అవసరమవుతాయని పేర్కొన్నారు. భారతీయ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రపంచ ఆర్థిక వృద్ధి మాత్రం నెమ్మదించిందని, 3.5 శాతం మాత్రమే ఉందని చెప్పారు.