2 లక్షల సంస్థలపై వేటు... ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలు పనిచేయవు
2లక్షలకు పైగా ఉన్న డొల్ల కంపెనీల బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్ని బ్యాంకులను ఆదేశించారు. కంపెనీలకు రుణాలు మంజూరు చేసే విషయంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా
కంపెనీల రిజిస్ట్రార్ జాబితా నుండి తొలగించిన 2లక్షలకు పైగా ఉన్న డొల్ల కంపెనీల బ్యాంకు లావాదేవీలపై ఆంక్షలు విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్ని బ్యాంకులను ఆదేశించారు. కంపెనీలకు రుణాలు మంజూరు చేసే విషయంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ఆయన బ్యాంకులకు సూచించారు. కంపెనీలకు రుణాలు మంజూరుచేసే సమయంలో బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ పరిణామానికి సంబంధించి లోతుగా మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
ఆర్థిక శాఖ ఆదేశాలు
ఆర్థిక శాఖలోని ఆర్థిక సర్వీసుల విభాగం భారత బ్యాంకుల సంఘం ద్వారా ఈ ఆదేశాలను ఆయా బ్యాంకులకు జారీ చేసింది. కంపెనీల రిజిష్ట్రార్ జాబితా నుండి తొలగించి ఈ కంపెనీలు పని చేయటం ఆగిపోయినందున వీటికి సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలిపివేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీచేసింది. మూసివేసిన కంపెనీల ఖాతాలు ఎలా పని చేస్తాయి? వాటిని ఎలా అనుమతిస్తారని ఆర్థిక శాఖ బ్యాంకులను ప్రశ్నించింది.
నోట్ల రద్దు తర్వాత బోగస్ కంపెనీల రద్దు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పాత వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్లను రద్దుచేసిన నేపథ్యంలో అందిన సమాచారం మేరకు ఆర్థిక శాఖ రెండు లక్షల బోగస్ కంపెనీల రిజిష్ట్రేషన్ను రద్దు చేయటం తెలిసిందే. ఈ కంపెనీలు బినామీ, బోగస్ కంపెనీలుగా వ్యవహరిస్తూ నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చాయన్నది ఆర్థిక శాఖ ఆరోపణ. రిజిస్టర్ చేసిన కంపెనీల ఖాతాలపై వెంటనే ఆంక్షలు విధించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
లావాదేవీలు కొనసాగుతున్నా...
కంపెనీలు లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు వెబ్సైట్లలో కనిపించినా తీసుకున్న రుణాలు, ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలను నమోదు చేస్తుండవచ్చు కానీ అటువంటి సంస్థలు ఆర్థిక లావాదేవీలు, యాన్యువల్ రిటర్న్స్లో అన్ని వివరాలు చూపించని పక్షంలో వాటిని అనుమానించి తగు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ బ్యాంకులను ఆదేశించింది. వాటాదారులకు రుణాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను తెలియజేయాలన్న స్టాచుటరీ విధిని పాటించకపోవటం తీవ్రమైన అంశమని ఆర్థిక శాఖ సూచించింది.
331 షెల్ కంపెనీలపై చర్యలకు ఆదేశం
స్టాచుటరీ విధులను పాటించని కంపెనీలపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశించారు. కంపెనీల చట్టంలోని 252 సెక్షన్ ప్రకారం కంపెనీ నమోదును రద్దు చేసిన కంపెనీల గుర్తింపును జాతీయ కంపెనీ చట్టం ట్రిబ్యునల్ పునరుద్ధరించనంత వరకు సదరు కంపెనీల డైరక్టర్లు, అధీకృత సంతకందారులు వీటి ఖాతాలను నిర్వహించేందుకు అనుమతించరాదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. డిరిజిష్టరైన కంపెనీలు రెండు ఆర్థిక సంవత్సరాలపాటు ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లేదు. 331 షెల్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కూడా సెబీని కేంద్రం ఆదేశించింది.