కాగ్నిజెంట్ సంస్థ నుంచి 400 మందికి ఉద్వాసన
అమెరికా ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఉద్వాసన పలికింది. ఇటీవల కంపెనీ ప్రకటించిన తొమ్మిది నెలల వేతనంతో కూడిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఎస్పీ) పథకానికి వీరు అంగీకారం
అమెరికా ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు ఉద్వాసన పలికింది. ఇటీవల కంపెనీ ప్రకటించిన తొమ్మిది నెలల వేతనంతో కూడిన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఎస్పీ) పథకానికి వీరు అంగీకారం తెలిపారని కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మంది ఉద్యోగులు కాగ్నిజెంట్లో పనిచేస్తున్నారు. వీఎస్పీకి ఆమోదం తెలిపిన 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లలో ఎక్కువ మంది భారత ఉద్యోగులేనని భావిస్తున్నారు.
ఈ ఆఫర్ను అంగీకరించిన వారిలో భారత ఎగ్జిక్యూటివ్లు ఎంత మంది ఉన్నారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వైదొలుగుతుండటంతో కంపెనీకి ఏటా 60 మిలియన్ డాలర్లు ఆదా అవుతాయని కాగ్నిజెంట్ సీఎఫ్ఓ కరెన్ మెక్లీన్ పేర్కొనడం గమనార్హం. ఉద్యోగులపై వేటుతో కంపెనీ లాభాలు మెరుగుపడతాయని వ్యాఖ్యానించారు. సామర్థ్య మదింపు, వీఎస్పీ కారణంగా తమ సంస్థలో ఉద్యోగుల నిష్ర్కమణ రేటు అత్యధికంగా ఉందని చెప్పారు. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఒకేసారి పెద్ద స్థాయిలో ఉన్న చాలా మందిని పక్కనపెట్టాలనేది కంపెనీ ప్రణాళికగా ఉంది. మొత్తం ఉద్యోగులను సర్దుబాటు చేయడంలో భాగంగా 39 మిలియన్ డాలర్లు ఖర్చుపెడుతుంటే కేవలం ఈ 400 మంది కోసమే 35 మిలియన్ డాలర్లు కేటాయించారు. అయితే ఈ స్వచ్చంద పదవీ విరమణ ద్వారా ఏటా 60 మిలియన్ డాలర్ల మేర కంపెనీకి ఆదా అవుతుందనేది అంచనాగా ఉంది.