హెచ్1బీ, ఆటోమేషన్ ప్రభావంతో ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు
ట్రంప్ ప్రకంపనలు కేవలం హెచ్-1బీ వీసాలపై పంపే ఐటీ సంస్థలనే కాకుండా దాదాపు దేశ ఐటీ రంగాన్ని, ఐటీయేతర రంగాలను తాకినట్లుగా ఉన్నాయి. చాలా పెద్ద ఐటీ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన కలిపేందుకు సిద్ద
ట్రంప్ ప్రకంపనలు కేవలం హెచ్-1బీ వీసాలపై పంపే ఐటీ సంస్థలనే కాకుండా దాదాపు దేశ ఐటీ రంగాన్ని, ఐటీయేతర రంగాలను తాకినట్లుగా ఉన్నాయి. చాలా పెద్ద ఐటీ సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన కలిపేందుకు సిద్దమవుతుండటమే దీనికి నేపథ్యం. ఈ విధంగా ఉద్యోగులను తొలగిస్తున్న 9 కంపెనీలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. కాగ్నిజెంట్
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సంస్థ కాగ్నిజెంట్ దాదాపు 6 వేల మంది ఉద్యోగులను తొలగిస్తుందని సమాచారం. తక్కువ స్థాయి ఐటీ ఉద్యోగాల్లో ఆటోమేషన్ కారణంగా కొన్ని పోస్టులను తగ్గించాల్సి రావడమే ఇందుకు కారణం. అయితే డైరెక్టర్లు, అసోసియేట్ వైస్ప్రెసిడెంట్, సీనియర్ వైస్ప్రెసిడెంట్ స్థాయిలో రూ.40 లక్షల కంటే ఎక్కువ ప్యాకేజీ తీసుకునే వారిని తొలగించనున్నట్లు సీటీఎస్ స్వయంగా ప్రకటించింది. ఇలాంటి వారికి 6 నుంచి 9 నెలల పాటు ప్యాకేజీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. మొత్తానికి 1000 మంది ఉద్యోగులు ఈ విధంగా ప్రభావితమవుతారని అంటున్నారు.
2. ఇన్ఫోసిస్
దేశ ఐటీ రంగాన్ని సమూలంగా మార్చిన కంపెనీ ఇన్ఫోసిస్. ఆ సంస్థ సైతం వచ్చే రోజుల్లో కొంత మందిని తీసివేస్తున్నట్లు ఐటీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా కంపెనీ వ్యూహాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ద్వైవార్షికంగా కంపెనీ జరిపే పనితీరు మదింపులో భాగంగా ఉద్యోగుల తొలగింపు ఉండగలదని భావిస్తున్నారు. లెవెల్ 6 పైన ఉండే 1000 మంది ఉద్యోగులు కంపెనీ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫోసిస్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఇంజినీర్లు ఎక్కువగా పనిచేస్తుంటారు.
3. విప్రో
దేశంలో మూడో ఐటీ దిగ్గజం విప్రో సైతం ఉద్యోగుల పనితీరును బట్టి కొంతమందిని ఇంటికి సాగనంపే యోచనలో ఉంది. మేనేజర్, ఎగ్జిక్యూటివ్ స్థాయిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. వార్షిక పనితీరు మదింపులో భాగంగా విప్రో దాదాపు ఇప్పటికి 500 మందిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా 600 మందిని ఉద్యోగులను తొలగించారని, ఇంకా ఈ సంఖ్య 2 వేల వరకూ ఉండొచ్చని కంపెనీలో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.
4. స్నాప్డీల్
దేశ ఈ-కామర్స్లో మూడో అతిపెద్ద సంస్థ అయిన స్నాప్డీల్ సైతం ఉద్యోగులను తొలగించనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిర్దారించింది. అయితే ఈ నిర్ణయం కారణంగా ఎంత మంది మీద ప్రభావం ఉంటుందనే సంగతిని వెల్లడించలేదు. అయితే మొత్తానికి మొత్తం ఉద్యోగుల్లో 30% వరకూ ఉపాది కోల్పోవచ్చని అంచనా. సంఖ్య పరంగా చూస్తే స్నాప్డీల్లో 1000 మంది ఉద్యోగాలు ఊడతాయని ఈ-కామర్స్ వర్గాలు అంటున్నాయి.
5.ఎయిర్సెల్
700 మందికి ఉద్వాసన పలికేందుకు టెలికాం సంస్థ ఎయిర్సెల్ సిద్దమైంది. రిలయన్స్లో కలిసే ప్రక్రియ పూర్తవ్వక మునుపే ఇది జరగనుంది. భారతదేశ వ్యాప్తంగా మొత్తం 10% మంది ఉద్యోగులకు పింక్ స్లిప్లు ఇస్తారని తెలుస్తోంది. మ్యాన్ పవర్ను తగ్గించడంతో పాటు, ఉద్యోగుల ఏకీకరణ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎయిర్సెల్ సంస్థకు మన దేశంలో మొత్తం 8 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.
6. టాటా టెలి సర్వీసెస్
దేశంలో దాదాపు 19 టెలికాం సర్కిళ్లలో టాటా టెలి సర్వీసెస్ విస్తరించింది. టాటా డొకొమో పేరిట టెలికాం రంగంలో పర్ సెకండ్ అనే ఒక కొత్త ఒరవడిని ఈ సంస్థ సృష్టించింది. ఇప్పుడు వివిధ కారణాల వల్ల ఈ టెల్కో నష్టంలో కొనసాగుతున్నది. దీంతో 500-600 మందిని పక్కన పెట్టేస్తారని ప్రచారం జరుగుతోంది. టెలికాం రంగంలో ఉన్న తీవ్రమైన పోటీని తట్టుకునేందుకు ఈ టాటా గ్రూప్ సంస్థ ఈ విధమైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ పని చేసిన ప్రతి ఏడాదికి ఒక నెల చొప్పున తొలగించనున్న ఉద్యోగులకు కాంపెన్సేషన్ ప్యాకేజీని నిర్ణయించారు.
7. టెక్ మహీంద్రా
రెవెన్యూ పరంగా చూస్తే దేశంలో టెక్ మహీంద్రా ఐదో అతిపెద్ద ఐటీ సంస్థ. ఆ కంపెనీ సైతం ఇటీవల వార్షిక పనితీరును బట్టి ఉద్యోగుల సర్దుబాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న టెక్ఎమ్ ఎంతమందిని తీసేస్తుందో స్పష్టంగా వెల్లడించలేదు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కొన్ని వందల మంది ఈ నిర్ణయం వల్ల ఇంటి దారి పట్టాల్సి వస్తుందని అంటున్నారు. డిసెంబరు, 2016 నాటికి టెక్ మహీంద్రాలో దాదాపుగా 1.17 లక్షల మంది పనిచేస్తున్నారు.
8. ట్రంప్ నిర్ణయం కారణంగానే కాగ్నిజెంట్ ఇలా చేస్తున్నదా...
కాగ్నిజెంట్ అమెరికా వెలుపల భారత్లోనే అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థలో 2,60,000 మంది పనిచేస్తుంటే అందులో మన దేశంలోనే 75% పనిచేస్తున్నారు. పని తీరు సరిగా లేని కారణంగా కింది స్థాయిలో కేవలం 1% మందికే ఉద్వాసన పలుకుతామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. అయితే ప్రతి ఏటా జరిగే వార్షిక మదింపులో భాగం అని అంటున్నారు. కానీ సీనియర్ లెవెల్స్లో చాలా మందిని స్వచ్చందంగా ఆకర్షణీయ ప్యాకేజీతో పక్కన పెడతారని చెబుతున్నారు.
9. ఫ్రెంచి ఐటీ సంస్థ క్యాప్జెమినీ సైతం
కాగ్నిజెంట్ తర్వాత దక్షిణ భారతదేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉపాది కల్పిస్తున్న ఐటీ సంస్థలో క్యాప్జెమినీ ఒకటి. దీని ప్రధాన కేంద్రం ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఉంది. డిసెంబరు 2016 నాటికి ఈ కంపెనీలో 1,90,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇలాంటి సంస్థ 35 సీనియర్ వైస్ ప్రెసెడంట్, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లు కంపెనీని వదిలిపోవాల్సిందిగా ఫిబ్రవరిలో చెప్పినట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఏడాది వ్యవధిలో కొత్తగా 20 వేల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది సంతోషించాల్సిన విషయం.
టీసీఎస్ ఒక్కటే విరుద్దంగా
దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఒక్కటే ఉద్యోగులను తొలగించే జాబితాలో లేదు. దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ అయిన ఈ సంస్థలో దాదాపు 3,90,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఉద్యోగులకు ఉద్వాసన పలికే యోచన లేదని కంపెనీ అధికారిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. సంప్రదాయ మార్గాల ద్వారా వచ్చే వ్యాపార అవకాశాలు తగ్గిపోతున్నాయి. అయినప్పటికీ డిజిటల్ రెవెన్యూ మొత్తంలో నాలుగో వంతు లేదు. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఇది బాగా పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో ఐటీ కంపెనీలన్ని ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి.