ఆ రెండు కంపెనీల విలీనంతో జియో,ఎయిర్టెల్కు చుక్కలేనా?
భారత టెలికాం దిగ్గజం ఐడియాతో విలీనానికి చర్చలు జరుపుతున్నట్లు బ్రిటీష్ టెలికాం సంస్థ వోడాఫోన్ సోమవారం ప్రకటించింది. ఇది భారతీయ మొబైల్ నెట్వర్క్ మార్కెట్లో ఉన్న తీవ్రపోటీని తట్టుకోవటానికి ఉపయోగపడు
భారత టెలికాం దిగ్గజం ఐడియాతో విలీనానికి చర్చలు జరుపుతున్నట్లు బ్రిటీష్ టెలికాం సంస్థ వోడాఫోన్ సోమవారం ప్రకటించింది. ఇది భారతీయ మొబైల్ నెట్వర్క్ మార్కెట్లో ఉన్న తీవ్రపోటీని తట్టుకోవటానికి ఉపయోగపడుతుందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు సంస్థ సంక్షిప్త ప్రకటనలో పేర్కొంది. ఐడియాకు మాతృసంస్థ అయిన ఆదిత్యబిర్లా గ్రూపుతో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ డెవలప్మెంట్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం.
ఎయిర్టెల్, జియోలకు గడ్డుకాలం రానుందా?
టెలికాం ఇండస్ట్రీ మొత్తం తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని భావిస్తున్న దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్, కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టిన జియోకు గట్టి పోటీ ఎదురుకాబోతుందా? అంటే అవునంటున్నాయి టెలికాం వర్గాలు. దేశంలో టాప్-3లో ఉన్న రెండు దేశీయ టెలికాం దిగ్గజాలు ఐడియా, వొడాఫోన్లు చేతులు కలపబోతున్నాయి. వొడాఫోన్ నెట్వర్క్ను ఐడియాలో విలీనం చేసేందుకు ఆదిత్య బిర్లా గ్రూప్తో చర్చలు సాగుతున్నాయని బ్రిటిష్ దిగ్గజం స్పష్టత ఇచ్చింది.
వోడాఫోన్ ప్రకటన
గత కొన్ని రోజులుగా ఈ రెండు కంపెనీలు జట్టు కడతాయని మార్కెట్లోనూ వార్తలు వినిపించాయి. ఈ వార్తలను ధృవీకరిస్తూ వొడాఫోన్ సైతం ఒక ప్రకటన విడుదల చేసేసింది. దీంతో రెండు కంపెనీల మధ్యే ఉంటుందన్న పోటీ త్రిముఖంగా మారబోతోంది. ఇప్పటిదాకా నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎయిర్టెల్తో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జియో పోటీపడుతోంది. ఇటీవల విడుదలైన త్రైమాసిక ఫలితాల్లో సైతం ఆ ప్రభావం కనిపించింది. జియో తన 4జీ ప్రభంజనంతో భారతి ఎయిర్టెల్కూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
నంబర్ వన్ ఎవరో?
ఇటీవల విడుదైన ఫలితాల్లోనూ ఎయిర్టెల్ లాభాలకు జియో ఏ మేర గండికొడుకుతుందో అర్థమైంది. ప్రస్తుతం ఐడియాలో వొడాఫోన్ విలీనమైతే నెంబర్ వన్ స్థానం కోసం మూడు దిగ్గజాలు పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రిటన్కు చెందిన దిగ్గజం వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్ ఐడియాలు భారత మార్కెట్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. లాభాలను సమంగా పంచుకోనేలా డీల్ కుదుర్చుకోవాలని భావిస్తున్న ఈ రెండు కంపెనీలు.. దీనివల్ల మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీని తట్టుకోవాలని వ్యూహాలు రచిస్తున్నాయి. వొడాఫోన్కు ఐడియా కొత్తగా షేర్లు జారీ చేస్తేనే ఈ విలీనం జరుగుతుందని స్పష్టంచేసింది. అయితే కచ్చితంగా ఈ విలీనం ఎప్పుడు ఉంటుందన్న విషయం మాత్రం వెల్లడించలేదు.
ఐడియా ప్రణాళిక ఏంటో?
ఐడియా-వొడాఫోన్ ఒక్కటైతే జియోకు టెలికాం రంగంలో ఆధిపత్యం సాధించడం కష్టమేనంటున్నారు. ప్రస్తుతం ఎయిర్టెల్ 27 కోట్లమంది వినియోగదారులతో అగ్రస్థానంలో ఉంది. ఐడియా-వొడాఫోన్ ఒక్కటైతే ఈ విలీనంతో రెండు కంపెనీల సంస్థ వినియోగదార్ల సంఖ్య 39 కోట్లకు ఎగబాకనుంది. ఇక రియలన్స్ జియో ప్రస్తుత వినియోగదారుల సంఖ్య 7.2 కోట్లు. ఆఫర్ ముగిశాక ఎంతమంది ఆ నెట్వర్క్ను కొనసాగిస్తారో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఐడియా-వొడాఫోన్ కలవడం ద్వారా భారత మార్కెట్లో బలీయమైన శక్తిగా ఎదగాలన్నది ఐడియా ఆలోచన. తద్వారా అటు ఎయిర్టెల్ కానీ, ఇటు జియో కానీ ఎంత ప్రయత్నించిన నంబర్ వన్ స్థానానికి చేరుకోవడం దాదాపు అసాధ్యమని టెలికం రంగ విశ్లేషకులు చెబుతున్నారు.
షేర్లలో భారీ కదలికలు
అయితే ఇండస్ టవర్స్లో వొడాఫోన్కు ఉన్న 42 శాతం వాటాతో ఈ విలీనానికి ఎలాంటి సంబంధం ఉండదు. విలీన చర్చలను వొడాఫోన్ ధృవీకరించడంతో ఐడియా సెల్యులార్ 26 శాతం ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ ఇతర టెలికాం షేర్లలోనూ కనిపించింది. భారతీ ఎయిర్టెల్ 8 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 12.5 శాతం పెరిగాయి.
ఇది కూడా చదవండి డిజి ధన్, లక్కీ గ్రాహక్ లాటరీల్లో మీ పేరుందో లేదో తెలుసుకోవడం ఎలా?
నియంత్రణ సంస్థల అనుమతులు అవసరమే
ఈ విలీనానికి నియంత్రణ సంస్థల అనుమతులు, అమలు పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని టెలికాం వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు కంపెనీలు కలిస్తే అయిదు సర్కిళ్లలో(మొత్తం 22) ఆదాయ మార్కెట్ వాటా, స్పెక్ట్రమ్ పరిమితులను ఉల్లంఘించినట్లవుతుంది. వాటిని తగ్గించడమే ప్రధాన సవాలు కానుంది. ఇక కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి అనుమతులు లభించడం కూడా క్లిష్టమే. భారతీ, వొడాఫోన్లను 42% చొప్పున; ఐడియాకు 16% వాటా ఉన్న ఇండస్ టవర్ యాజమాన్యంలో మార్పులకు సిద్ధంగా ఉండాలనీ నిపుణులు అంటున్నారు. రెండింటి కలయిక వల్ల ఈ టవర్ల కంపెనీ అద్దెలు తగ్గే అవకాశం కూడా ఉంది. విలీనం పూర్తయ్యే వరకూ కూడా మార్కెట్ హెచ్చుతగ్గులకు ఇరు కంపెనీలూ సిద్ధంగా ఉండాల్సి రావొచ్చు.
స్పెక్ట్రమ్ హోల్డింగ్
ప్రస్తుతం ఉన్న విలీనం, స్వాధీన (మెర్జర్ అండ్ అక్విజిషన్స్) నిబంధనల ప్రకారం నూతన సంస్థకు మార్కెట్ రెవెన్యూ వాటా 50% కంటే ఎక్కువ ఉండకూడదు. కొత్త సంస్థ ఏర్పడిన తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, హర్యానా, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్లో ఆధిపత్యం ఐడియా(ఐడియా-వోడాఫోన్)కే దక్కుతుంది. అంతే కాకుండా సింగల్ బ్యాండ్లో సైతం 50% కంటే ఎక్కువ స్పెక్ట్రమ్ ఒకే సంస్థ వద్ద ఉండటానికి లేదు. మెర్జింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేరళ, గుజరాత్ సర్కిల్స్లో స్పెక్ట్రమ్ హోల్డింగ్ కొత్త సంస్థకు ఎక్కువగా ఉండబోతోంది. వీటన్నింటిపై నియంత్రణ సంస్థలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.
పొదుపు, పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఇది మీ కోసమే...