భారత్లో సంపన్నులు 2.36 లక్షల మంది
న్యూఢిల్లీ: ఆసియా ఫసిఫిక్ ప్రాంతంలోని దేశాల్లో సంపన్నులు (మిలియనీర్లు) అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాల్గవ స్ధానంలో నిలిచింది. న్యూ వరల్డ్ వెల్త్ సంస్ధ ‘ఆసియా పసిఫిక్ 2016 వెల్త్ రిపోర్ట్' పేరిట ఓ నివేదికను ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 2.36 లక్షల మంది సంపన్నులు దేశంలో ఉన్నారని అందులో పేర్కొంది.
ఆసియా పసిఫిక్ దేశాల్లో మొత్తం 35 లక్షల మంది సంపన్నులు ఉండగా, వీరి సంపద విలువ 17.7 లక్షల కోట్ల డాలర్లని పేర్కొంది. 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.6.7 కోట్ల) వ్యక్తిగత సంపద కలిగిన వారితో సంస్థ ఈ నివేదిక రూపొందించింది. గత 15 సంవత్సరాల్లో వీరి సంఖ్య 115 శాతం పెరిగింది. ఈ జాబితాలో 12.60 మంది సంపన్నులతో జపాన్ అగ్రస్థానంలో ఉంది.
ఆ తర్వాత 6.54 లక్షల మందితో చైనా 2వ స్థానంలో, 2.90 లక్షల మందితో ఆస్ట్రేలియా 3వ స్థానంలో నిలిచాయి. 2.24 లక్షల మందితో సింగపూర్ 5వ స్థానం, 2.15 లక్షల మందితో హాంకాంగ్ 6వ స్థానం, 1.25 లక్షల మందితో దక్షిణకొరియా 7వస్థానం, 98,200 మందితో తైవాన్ 8వ స్థానం, 89,000 మందితో న్యూజిలాండ్ 9వస్థానం, 48,500 మందితో ఇండొనేషియా 10వ స్థానంలో నిలిచాయి.

వచ్చే పదేళ్లలో వీరి సంఖ్య మరింతగా పెరుగుతుందని, 2025 నాటికి ఈ ప్రాంతం అత్యధిక సంపన్నులు కలిగిన ప్రాంతంగా నిలుస్తుందని పేర్కొంది. 2025 నాటికి భారత సంపన్నుల జనాభా 105 శాతం పెరిగి 4.83 లక్షలకు చేరుతుందని అంచనా వేసింది.
కాగా, వ్యక్తులందరి సంపద 4,365 బిలియన్ డాలర్లతో ఆసియా పసిఫిక్లోని తొలి 5 దేశాల్లో భారత్కు చోటు లభించింది. 17,254 బిలియన్ డాలర్ల సంపదతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. ఆస్తులు, నగదు, ఈక్విటీలు, వ్యాపారాల్లో వాటాలను సంపదలో భాగంగా లెక్కించారు.


Click it and Unblock the Notifications


