కెసిఆర్, యనమలతో ఆర్బిఐ గవర్నర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో బుధవారం రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ సమావేశమయ్యారు. సచివాలయంలో సిఎంతో సమావేశమైన రఘురాం రాజన్.. రైతు రుణమాఫీ, రాష్ట్రంలో పరిస్థితులు, నిధుల కేటాయింపు, రుణ పంపిణీ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

ఏపి ఆర్థిక మంత్రి యనమలతో రాజన్ భేటీ
తెలంగాణ సిఎంతో భేటీ అయిన తర్వాత రిజర్వు బ్యాంకు గరవ్నర్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో భేటీ అయ్యారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. రుణ మాఫీ అంశంపై చర్చించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాలని రఘురాం రాజన్ను కోరినట్లు యనమల రామకృష్ణుడు, ఎంపి సుజానా చౌదరి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజన్కు వివరించినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సాధికారిత కార్పొరేషన్ గురించి ఆయనకు వివరించినట్లు తెలిపారు. విజయవాడలో ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని గవర్నర్ రాజన్ తమను కోరారని యనమల, సుజనా తెలిపారు.
చేతి వృత్తిదారుల ప్రదర్శనను ప్రారంభించిన రాజన్
చేతి వృత్తిదారుల ప్రదర్శనను రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్ రిజర్వ్ బ్యాంకు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వివిధ జిల్లాలకు చెందిన చేతివృత్తిదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications