లక్షకోట్ల మార్కు దాటిన అనిల్ అంబానీ గ్రూప్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ దూసుకెళ్తున్న క్రమంలో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ మార్కెట్ విలువ లక్ష కోట్ల రూపాయలను దాటింది. గ్రూప్లోని అన్ని సంస్థల షేర్ల విలువ గణనీయంగా పెరిగిపోవడంతో మొత్తం రిలయన్స్ గ్రూప్ మార్కెట్ విలువ 1,01,832 కోట్ల రూపాయలకు చేరింది.
నిరుడు ఇదే సమయంలో గ్రూప్ మార్కెట్ విలువ 50,000 కోట్ల రూపాయలకే పరిమితం కావడం గమనార్హం. బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ తెలిపిన వివరాల ప్రకారం.. రిలయన్స్ కమ్యునికేషన్స్ షేర్ల విలువ 34,377 కోట్ల రూపాయలకు చేరితే, రిలయన్స్ పవర్ షేర్ల విలువ 30,548 కోట్ల రూపాయలకు, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విలువ 20,797 కోట్ల రూపాయలకు, రిలయన్స్ క్యాపిటల్ విలువ 16,110 కోట్ల రూపాయలకు చేరాయి.
ఇది ఇలా ఉండగా బిఎస్ఈలోని అన్ని సంస్థల మార్కెట్ విలువ సైతం 92 లక్షల కోట్ల రూపాయలను తాకింది. టాటా గ్రూప్ 8 లక్షల కోట్ల రూపాయలతో తొలి స్థానంలో ఉండగా, హెచ్డిఎఫ్సి (3.7 లక్షల కోట్లు), ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ (3.35 లక్షల కోట్లు) తర్వాతి 2 స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం బిఎస్ఈ సూచీ సెన్సెక్స్ 26,000ల స్థాయికి అడుగు దూరంలో 25,962 పాయింట్ల వద్ద కదలాడుతోంది.
కాగా, సోమవారం స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకుపైగా లాభంతో సెన్సెక్స్, 20 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 26వేల పాయింట్ల మార్క్ దాటింది.