మోడీ ప్రమాణం: హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పారిశ్రామిక రంగానికి చెందిన అతిరథ మహారధులంతా తరలివచ్చారు. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, భారతీ ఎంటర్ప్రైజెస్ అధిపతి సునీల్ మిట్టల్, హిందూజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందూజా సహా పలువురు పారిశ్రామిక దిగ్గజాలు మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సుమారు 4,500 మంది పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ సహా ఆయన సతీమణి నీతా, ఇద్దరు కుమారులు, ఆయన సోదరుడు అనిల్ అంబానీ కుటుంబం తోపాటు తల్లి కోకిలాబెన్ అంబానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు గౌతమ్ అదానీ, ఆయన భార్య, ఎస్సార్ గ్రూప్ అధినేత శశి రుయా, సిఈఓ ప్రశాంత్ రుయాలు వచ్చారు.
మిట్టల్ సోదరులైన సునీల్, రాజన్, రాకేష్ సహా డిఎల్ఎఫ్ వైస్ చైర్మన్ రాజీవ్ సింగ్, హీరో మోటో కార్ప్ ఎండి, సిఈఓ పవన్ ముంజాల్, సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి, వీడియోకాన్ గ్రూప్ అధినేత రాజ్కుమార్ ధూత్ మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. విమానయాన రంగానికి సంబంధించి జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్, ఎయిర్ ఆసియా ఇండియా ప్రెసిడెంట్ మిట్టు చండిల్యా హాజరయ్యారు. ఆర్థిక రంగం నుంచి నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్, జీ ఎంటర్టైన్మెంట్ చైర్మన్, అసోచామ్ ప్రెసిడెంట్, యస్ బ్యాంక్ హెడ్ రాణా కపూర్, ఎస్సెల్ గ్రూప్ ప్రమోటర్ సుభాష్ చంద్ర, జెఎస్డబ్ల్యు స్టీల్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కూడా పాల్గొన్నారు.
ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్ధ బిర్లా, పిహెచ్డి చాంబర్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా, ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ యుఎస్ అవస్థి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. కాగా, టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా, ఆయన వారసుడు సైరస్ మిస్త్రీలను ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించినప్పటికీ వారు విదేశీ పర్యటనలో ఉండటంతో హాజరు కాలేకపోయారు. ఎం అండ్ ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా, యుబి గ్రూప్ చీఫ్ విజయ్ మాల్యాలు కూడా విదేశాల్లో ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
మోడీకి శుభాకాంక్షలు: పారిశ్రామిక వర్గాలు
భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీకి పారిశ్రామిక, వ్యాపార వర్గాలు శుభాకాంక్షలు తెలిపాయి. మోడీ పాలనలో దేశం వృద్ధిపథంలో సాగాలని ఆకాంక్షించాయి. గాడితప్పిన వృద్ధిరేటును సరైన కక్ష్యలోకి తీసుకువచ్చి, ఉద్యోగవకాశాలను సృష్టించి, ఆదాయాన్ని పెంచుతూ, సామాజిక సుస్థిరతకు మోడీ బాటలు వేస్తారన్న విశ్వాసాన్ని వెలిబుచ్చాయి. సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మాట్లాడుతూ.. వృద్ధిరేటు, పెట్టుబడుల బలోపేతానికి అవసరమైన సహకారాన్ని కొత్త ప్రభుత్వానికి అందజేస్తామని పారిశ్రామిక రంగం తరఫున అన్నారు.
ఫిక్కీ అధ్యక్షుడు సిద్ధార్థ బిర్లా మాట్లాడుతూ.. ‘వ్యాపార విశ్వాసం పెంపొందించడం, ఉద్యోగాల సృష్టికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడం, ఆహార ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం, పారిశుధ్య, పోషకాహార సమస్యలను అధిగమించడం వంటి వాటికి మోడీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి' అని అన్నారు. ‘కొత్త ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఆయన మంత్రివర్గ సహచరులకు శుభాకాంక్షలు. దేశాభివృద్ధికి ప్రభుత్వానికి తమవంతు సహాయ, సహకారాలుంటాయి' అని విదేశాల్లో ఉండటం వల్ల మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పేర్కొన్నారు.
‘భారత పరిపాలన, అభివృద్ధికి సారథ్యం వహిస్తున్న నరేంద్ర మోదీకి అభినందనలు. మోదీ నాయకత్వంలో దేశ వృద్ధిరేటు స్థిరంగా 10 శాతానికి ఎదగాలి.' అని అసోచామ్ అధ్యక్షుడు రాణా కపూర్ అన్నారు. ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతీయ ఐటి పరిశ్రమకు ఆధారమైన అమెరికాలో వీసాల సమస్యకు మోడీ ప్రభుత్వం చక్కటి పరిష్కారం చూపగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.