2013కి స్వల్ప లాభాలతో వీడ్కోలు
ఇక 2013 మొత్తంగా సెన్సెక్స్ 1,743.97 పాయింట్లు బలపడగా, 21,326.42 పాయింట్ల వద్ద ముగిసి ఆల్టైమ్ రికార్డును సృష్టించింది. ఇంట్రా డే ట్రేడింగ్లోనూ డిసెంబర్ 9న 21,483.74 పాయింట్లని తాకింది. నిఫ్టీ సైతం 398.90 పాయింట్లు వృద్ధి చెందగా, 6,363.90 పాయింట్ల వద్ద నిలిచి ఆల్టైమ్ హైని చేరుకుంది. ఇంట్రా డే ట్రేడింగ్లోనూ డిసెంబర్ 9న 6,415.25 పాయింట్లని అందుకుంది. కాగా విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్ఐఐ) జోరు 2013లోనూ కొనసాగింది.
అయితే 2012తో పోల్చితే కాస్త తక్కువే అయినప్పటికీ 2013లో ఎఫ్ఐఐలు 1.13 లక్షల కోట్ల రూపాయల (20.1 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను దేశీయ స్టాక్ మార్కెట్లలోకి తీసుకొచ్చారు. 2012లో ఈ పెట్టుబడుల విలువ 1.3 లక్షల కోట్ల రూపాయలు (24 బిలియన్ డాలర్లు)గా ఉన్నాయి. అటు మదుపర్ల సంపద 1.10 లక్షల కోట్ల రూపాయలు పెరిగి 70.32 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇది ఇలా ఉండగా మంగళవారం ఆసియా స్టాక్మార్కెట్లలో చైనా, హాంకాంగ్, సింగపూర్ సూచీలు పెరగగా, తైవాన్ నష్టాల పాలైంది. జపాన్, దక్షిణ కొరియా మార్కెట్లు పని చేయలేదు. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు లాభాల్లో ఉండగా, జర్మనీ మార్కెట్ కూడా మూసి ఉంది.
2014 తొలి త్రైమాసికంలో మార్కెట్ ఆటుపోట్ల మధ్య కదలాడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక వేళ మార్చి తర్వాత మార్కెట్లు ఎన్నికల ఫలితాలను ముందుగానే డిస్కౌంట్ చేసే పక్షంలో అనూహ్యమైన ర్యాలీ ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇది పూర్తిగా ఎన్నికల వరకు కొనసాగకపోవచ్చని కూడా వెల్లడిస్తున్నారు.
ఎన్నికల ముందు పరిణామాలు మార్కెట్ గమనాన్ని నిర్ధేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలు ఎడాపెడా సంక్షేమ స్కీమ్లతో గ్రామీణ, నిరుపేద ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే దాని ప్రభావం మార్కెట్పై మరో విధంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్లో ఏదైనా పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని తేలితే మార్కెట్ ఉరకలు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 2014 ప్రధామార్థంలో మార్కెట్ రాబడులను ప్రధానంగా ఎన్నికలే ప్రభావితం చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.