భారత్ రికవరీకి రూ.60 లక్షల కోట్ల ఎఫ్డీఐలు అవసరం: నితిన్ గడ్కరీ
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, ఇది కోలుకోవడానికి ద్రవ్యలభ్యత అవసరమని, ఇందుకు రూ.50 లక్షల కోట్ల నుండి రూ.60 లక్షల కోట్ల వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) అవసరమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడుల అవసరాన్ని ఆయన చెప్పారు. మార్కెట్లోకి మనీని ఇన్ఫ్యూజ్ చేయాల్సి ఉందన్నారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలంటే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు ఎంఎస్ఎంఈ రంగం ద్వారా మనీని ఇన్ఫ్యూజ్ చేయాలని, అందుకు ఎఫ్డీఐలు అవసరమన్నారు.
జూలై 1 నుండి మారిన బ్యాంకు రూల్స్! ఇవి గుర్తుంచుకోండి, జరిమానా ఇలా తప్పించుకోవచ్చు
వీటన్నింటికి ఎఫ్డీఐలు అవసరం
కేంద్రమంత్రి గడ్కరీ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. హైవేలు, విమానాశ్రయాలు, ఇన్లాండ్ వాటర్ వేస్, రైల్వేస్, లాజిస్టిక్ పార్కులు, బ్రాడ్ గేజ్, మెట్రో వంటి మౌలిక రంగాలతో పాటు ఎంఎస్ఎంఈలు పెద్ద మొత్తంలో ఎఫ్డీఐలను ఆకర్షించగలుగుతాయన్నారు. మార్కెట్లోకి ద్రవ్య లభ్యతను పంప్ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎంఎస్ఎంఈ, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, బ్యాంకులకు మూలధనం అవసరమన్నారు. రోడ్ ట్రాన్సుపోర్ట్ సెక్టార్లో ఎఫ్డీఐలు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
అమెరికా, దుబాయ్ ఇన్వెస్టర్లతో చర్చలు
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ తప్పలేదని, దీంతో ఆర్థికకార్యకలాపాల పైన భారీ ప్రభావం పడిందని గడ్కరీ చెప్పారు. అందుకే ద్రవ్యలభ్యత అవసరం అన్నారు. ఎంఎస్ఎంఈలు సహా వివిధ రంగాలకు నిధుల కోసం అమెరికా, దుబాయ్లోని పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని ఎంఎస్ఎంఈలు బీఎస్ఈలో లిస్ట్ చేయబడ్డాయన్నారు. మూడేళ్ల టర్నోవర్, జీఎస్టీ చెల్లింపుల తీరును పరిగణలోకి తీసుకొని ఈఎంఎస్ఎంఈలలో పెట్టుబడులు పెట్టాలని పెట్టుబడిదారులను కోరినట్లు చెప్పారు.
ఎగుమతులు పెరిగి, దిగుమతులు తగ్గాలి
ఆర్థిక వృద్ధిని పెంచేందుకు మన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు. ఎగుమతులపై దృష్టి సారించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగుమతులు తగ్గించి, ఎగుమతులు పెంచాలని బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. కోరనా కారణంగా ప్రపంచమంతా సమస్యలు ఎదుర్కొంటోందని, మౌలిక సదుపాయాల కల్పన యుద్ధ ప్రాతిపదికన చేయాలన్నారు.
ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో నిధులు, ఉపాధి
ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం కారణంగా భారీ నిధులు సమీకరించేందుకు ఉపయోగపడుతుందని గడ్కరీ చెప్పారు. మరింత ఎక్కువ ఉపాధికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక రంగ ప్రోత్సాహంపై దీని ప్రభావం ఉంటుందన్నారు. థానేలోని ప్రతిపాదిత తోలు క్లస్టర్కు 1.5 లక్షల లెదర్ వర్కర్స్ను తరలించడంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక్కడ స్కూల్స్, హాస్పిటల్స్తో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయన్నారు.