ఆదాయపు పన్ను భారీ ఊరట, రూ.5 లక్షల లోపు రీఫండ్ చెల్లింపు: ఇది తప్పనిసరి!
ఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ(IT Department) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అతలాకులతమవుతోంది. కార్మికుల నుండి ఉద్యోగుల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగతా పలు దేశాలతో పోలిస్తే భారత్ జాగ్రత్తపడి లాక్ డౌన్ ప్రకటించింది. దీని ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే అందరూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎధుర్కొనే వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తాజాగా ఉపశమనం కల్పించింది.
అగాధంలో రూ.3,65,100 కోట్లు! హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుదేలు, ఏ నగరంలో ఎంతంటే?
రూ.5 లక్షల వరకు పెండింగ్ రీఫండ్స్ ఖాతాల్లోకి..
రూ.5 లక్షల వరకు పెండింగులో ఉన్న రీఫండ్స్ వెంటనే ఆయా ఐటీ చెల్లింపుదారుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దాదాపు 14 లక్షల మంది వ్యక్తిగత ఐటీ చెల్లింపుదారులు లబ్ధి పొందుతారని అంచనా. ఈ మేరకు బుధవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
వ్యాపారులకు జీఎస్టీ, కస్టమ్స్ రీఫండ్స్
దీంతో పాటు సుమారు లక్ష వ్యాపార సంస్థలకు చెల్లించాల్సిన దాదాపు రూ.18,000 కోట్ల జీఎస్టీ, కస్టమ్స్ రిఫండ్స్ను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో అనేక MSMEలకు ఎంతో ప్రయోజనం. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు, వ్యాపార సంస్థల దగ్గర నిధుల లభ్యత పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పెండింగులో రూ.18వేల కోట్ల పన్ను రీఫండ్స్
వ్యాపారులు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఇప్పటి వరకు రూ.18వేల కోట్ల పన్ను రీఫండ్స్ పెండింగులో ఉన్నాయి. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో వీటిని వెంటనే చెల్లించాలని నిర్ణయించడం గమనార్హం. అన్ని రకాల జీఎస్టీ, కస్టమ్స్ రీఫండ్ బకాయిల చెల్లింపు ద్వారా చిన్న తరహా పరిశ్రమల సహా లక్ష వ్యాపార సంస్థలకు ప్రయోజనం కలుగుతుందని ఆర్థిక శాఖ తెలిపింది.
వేతన కోత, వేతనాలు అందని వారికి భారీ ఊరట
ప్రస్తుత సంక్షోభం సమయంలో కొన్ని కంపెనీలు వేతన కోతలు విధిస్తున్నాయి. మరిన్ని సంస్థలు ఉద్యోగాలు తొలగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వేతనాలు ఇవ్వని యాజమాన్యాలు ఉన్నాయి. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఎంతో ఊరట కల్పిస్తుంది. 'కరోనా నేపథ్యంలో రూ.5 లక్షల లోపు అన్ని ఐటీ రీఫండ్, జీఎస్టీ కస్టమ్ రీఫండ్ పెండింగ్స్ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది' అని చెబుతున్నారు.
రిటర్న్స్ దాఖలు చేసి ఉండాలి, బ్యాంకు అకౌంట్ వ్యాలిడేటెడ్
డిపార్టుమెంటులో చిక్కుకుపోయిన తమ డబ్బు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు సహకరిస్తుంది. ఐటీ రిటర్న్స్ పొందేందుకు వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసి ఉండాలి. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. రీఫండ్ పొందేందుకు మీ బ్యాంకు ఖాతా ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్ సైట్లో ధృవీకరించబడి (వ్యాలిడేట్) ఉండాలి.