UPI ద్వారా షేర్లు, మ్యూచువల్ ఫండ్లు కొంటే బాదుడేనా.. ప్రతి రూ. లక్షకు MDR రేటు ఎంతో తెలుసుకోండి..
యూపీఐ వినియోగదారులకు కీలకమైన మార్పు రాబోతోంది. అక్టోబర్ 15, 2026 నుంచి కొన్ని యూపీఐ వ్యాపార లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుంది. అయితే సాధారణ ప్రజలు యూపీఐ ద్వారా చెల్లించే ప్రతి లావాదేవీకి ప్రత్యేకంగా ఈ రుసుమును చెల్లించాల్సిన అవసరం ఉండదు. కొత్త విధానం ప్రధానంగా వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే అంటే Person-to-Merchant (P2M) చెల్లింపులకు వర్తిస్తుంది. ఈ ఛార్జీని వ్యాపారి చెల్లింపు వ్యవస్థలోని సంబంధిత భాగస్వాములకు చెల్లిస్తారు.
కొత్త నిబంధనల ప్రకారం సాధారణ వ్యాపారికి చేసే రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ చెల్లింపుపై 0.4 శాతం MDR విధిస్తారు. అయితే ఒక్కో లావాదేవీకి గరిష్ఠ ఛార్జీ రూ.300గా నిర్ణయించారు. ఉదాహరణకు రూ.5,000 చెల్లిస్తే 0.4 శాతం ప్రకారం MDR రూ.20 అవుతుంది. రూ.10,000 చెల్లింపుపై రూ.40, రూ.50,000 చెల్లింపుపై రూ.200 MDR వస్తుంది. రూ.75,000 చెల్లింపుకు 0.4 శాతం ప్రకారం రూ.300 అవుతుంది. ఆ మొత్తానికి మించి చెల్లించినా MDR రూ.300 దాటదు.

అయితే ఇక్కడ వినియోగదారులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. ఈ MDRను కస్టమర్ నుంచి ప్రత్యేకంగా వసూలు చేయడానికి ఉద్దేశించిన రుసుము కాదు. అంటే ఒక సాధారణ దుకాణంలో మీరు రూ.5,000 విలువైన వస్తువు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే, MDR పేరుతో అదనంగా రూ.20 చెల్లించాల్సిన అవసరం ఉండదు. MDR వ్యాపారి చెల్లింపు వ్యవస్థలో భాగంగా ఉంటుంది.
వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే యూపీఐ బదిలీలకు మాత్రం ఈ MDR వర్తించదు. అంటే స్నేహితుడికి, కుటుంబ సభ్యుడికి రూ.5,000, రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ పంపినా ఈ కొత్త వ్యాపార MDR వర్తించదు. అలాగే రూ.2,000 వరకు చేసే P2M యూపీఐ చెల్లింపులు కూడా ఈ కొత్త MDR పరిధిలోకి రావు. నెలకు యూపీఐ QR ద్వారా రూ.1 లక్ష వరకు స్వీకరించే చిన్న వ్యాపారాలకు కూడా మినహాయింపు ఉంటుంది.
కొన్ని కీలక రంగాలకు మాత్రం ప్రత్యేక MDR రేట్లు ఉంటాయి. రైల్వేలు, టెలికాం, ఇంధనం, బీమా వంటి నిర్దిష్ట సేవలకు రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులపై సాధారణ 0.4 శాతం కాకుండా ఒక్కో లావాదేవీకి రూ.5 ఫ్లాట్ MDR ఉంటుంది. విద్యుత్, నీరు, పైప్డ్ నేచురల్ గ్యాస్ వంటి కొన్ని యుటిలిటీ చెల్లింపులకు కూడా ప్రత్యేక రేటు వర్తిస్తుంది.
ఇక షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, సెక్యూరిటీల కొనుగోలు, స్టాక్ బ్రోకర్లు, డీలర్లు, ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫారమ్లకు చేసే యూపీఐ చెల్లింపులకు ప్రత్యేకంగా 0.02 శాతం MDR నిర్ణయించారు. దీనికి ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి రూ.300. ఉదాహరణకు రూ.1 లక్ష పెట్టుబడి చెల్లింపుపై 0.02 శాతం ప్రకారం MDR రూ.20 అవుతుంది. రూ.5 లక్షలపై రూ.100, రూ.10 లక్షలపై రూ.200, రూ.15 లక్షలపై రూ.300 అవుతుంది. ఆ తర్వాత ఎంత పెద్ద మొత్తమైనా గరిష్ఠ MDR రూ.300గానే ఉంటుంది.
దీంతో జెరోధా వంటి స్టాక్ బ్రోకర్కు యూపీఐ ద్వారా రూ.1 లక్ష పెట్టుబడి మొత్తాన్ని పంపే సందర్భంలో.. ఆ లావాదేవీ కొత్త క్యాపిటల్ మార్కెట్ కేటగిరీకి అర్హత సాధిస్తే 0.02 శాతం ప్రకారం MDR రూ.20 అవుతుంది. అయితే ఈ MDR కస్టమర్పై నేరుగా విధించే ఛార్జీ కాదని గుర్తుంచుకోవాలి.
యూపీఐ వ్యవస్థలో మౌలిక సదుపాయాలు, సైబర్ సెక్యూరిటీ, సాంకేతిక నిర్వహణ, కస్టమర్ సర్వీసులు వంటి వాటికి నిరంతరం పెట్టుబడులు అవసరమవుతున్న నేపథ్యంలో కొత్త MDR విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆగస్టు 2026లో యూపీఐ ద్వారా 24.51 బిలియన్ లావాదేవీలు జరిగాయి. వాటి మొత్తం విలువ రూ.29.90 లక్షల కోట్లుగా ఉంది.
అందువల్ల సాధారణ యూపీఐ వినియోగదారుడి విషయంలో ప్రధాన విషయం ఏమిటంటే.. అక్టోబర్ 15 తర్వాత కూడా స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు పంపడం, రూ.2,000 వరకు వ్యాపార చెల్లింపులు చేయడం వంటి అనేక సాధారణ యూపీఐ లావాదేవీలపై ఈ కొత్త MDR ఉండదు. రూ.2,000కు మించిన కొన్ని వ్యాపార చెల్లింపుల్లో MDR అమల్లోకి వచ్చినప్పటికీ, దాన్ని కస్టమర్కు ప్రత్యేక ఛార్జీగా బదిలీ చేయకుండా వ్యాపారి-చెల్లింపు వ్యవస్థ మధ్యే నిర్వహించాల్సిన విధంగా కొత్త వ్యవస్థ రూపొందించబడింది.


Click it and Unblock the Notifications

