ITR: ఆదాయం తక్కువని ట్యాక్స్ ఫైల్ చేయడం లేదా.. మీకు నోటీసులు రావచ్చు..!
చాలా మంది తమకు తక్కువ ఆదాయమే ఉంది.. ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలని అంటారు. దీన్ని సాధారణ విషయంగా తీసుకుంటారు. కానీ ఆదాయం తక్కువున్నా ఐటీ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన మినహాయింపు కంటే ఎక్కువ ఆదాయం ఉంటే తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సిందే. ఆదాయపు పన్ను శాఖ మీ లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటుంది. ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ ITR దాఖలు చేయవలసి రావచ్చు.
విదేశీ ఆస్తుల యాజమాన్యం, అధిక విలువ గల బ్యాంకింగ్ లావాదేవీలు, విదేశీ ప్రయాణం వంటి ఎక్కువగా ఉంటే పన్ని చెల్లించాల్సి వస్తుంది. అయితే 2026-27 సంవత్సరానికి గానూ ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ ఊపందుకుంటున్న నేపథ్యంలో పన్ను చెల్లించే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(1), ప్రభుత్వం నోటిఫై అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.

విదేశీ ఆస్తులు ఉన్నవారు
ఎవరైనా భారతదేశం వెలుపల ఆస్తిని కలిగి ఉంటే ట్యాక్స్ ఫైల్ చేయాలి. విదేశీ సంస్థలో ఆర్థిక ప్రయోజనం కలిగి ఉన్నా, విదేశీ ఆస్తికి లబ్ధిదారుడు అయినా, విదేశీ బ్యాంకు ఖాతాలో సంతకం చేసే అధికారం కలిగి ఉన్నా, విదేశాల్లో స్టాక్స్, ఫారిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs), ఇతర విదేశీ ఆస్తులలో పెట్టుబడులు పెడుతున్నవారు పన్ను చెల్లించాలి.
మీరు విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి విదేశీ ప్రయాణాల కోసం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేస్తే వారు కూడా ఐటీ ఫైల్ చేయాలి. చివరికి పన్ను చెల్లించవలసి ఉన్నా లేకపోయినా ఈ నిబంధన వర్తిస్తుంది.
టీడీఎస్ లేదా టీసీఎస్ నిర్దేశించిన పరిమితిని దాటితే
సంవత్సరంలో మినహాయించిన టీడీఎస్ లేదా టీసీఎస్ దాటితే కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
పొదుపు ఖాతాలలో డిపాజిట్లు రూ.50 లక్షలు దాటితే
ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పొదుపు బ్యాంకు ఖాతాలలో రూ.50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసే వ్యక్తులు ఐటీఆర్ ఫైల్ చేయాలి.
కరెంట్ ఖాతాలలో డిపాజిట్లు రూ.1 కోటి దాటితే
ఆర్థిక సంవత్సరంలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కరెంట్ ఖాతాలలో జమ చేసిన మొత్తం రూ.1 కోటిని దాటితే ఇన్ కామ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి.
వ్యాపార టర్నోవర్ రూ.60 లక్షలు దాటినా
వ్యాపారం చేసే వ్యక్తుల మొత్తం అమ్మకాలు, టర్నోవర్ లేదా స్థూల రాబడులు ఆర్థిక సంవత్సరంలో రూ.60 లక్షలను దాటితే, వారు తప్పనిసరిగా రిటర్న్ దాఖలు చేయాలి.
వృత్తిపరమైన రాబడి రూ.10 లక్షలు దాటితేడాక్టర్లు, లాయర్లు, ఆర్కిటెక్టులు, కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లు, ఇతర స్వయం ఉపాధి పొందే వారు ఒక ఆర్థిక సంవత్సరంలో రాబడి రూ.10 లక్షలు దాటినట్లయితే, తప్పనిసరిగా ఐటీఆర్ ఫైల్ చేయాలి.
విద్యుత్ బిల్లులు రూ.1 లక్ష దాటినా
ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వినియోగంపై రూ.1 లక్ష దాటిన పన్ను చెల్లింపుదారులు కూడా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
సెక్షన్లు 80C నుంచి 80U వరకు ఉన్న మినహాయింపులు, మూలధన లాభాల మినహాయింపులతో సహా, నిర్దిష్ట మినహాయింపులు, మినహాయింపులను క్లెయిమ్ చేయడానికి ముందు ఉన్న ఆదాయం ఆధారంగా ఈ లెక్కింపు జరుగుతుందని గుర్తుంచుకోవాలి. 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి, కొత్త పన్ను విధానం కింద ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.4 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications