ఈ-కామర్స్ సంస్థలకు భారీ ఊరట, రెడ్ జోన్లలో వీటికీ అనుమతి, ఇవి కచ్చితంగా తెలుసుకోండి
కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వంలాక్ డౌన్ను మే 31వ తేదీ వరకు పొడిగించింది. ఇదే సమయంలో ఈ-కామర్స్ సంస్థలకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటికే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అత్యవసరం కాని వస్తువుల డెలివరీకి అనుమతి ఇచ్చింది కేంద్రం. ఇప్పుడు రెడ్ జోన్లలోను డెలివరీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
మోడీ అలా ఇస్తే మాకేం ప్రయోజనం, దేశానికి మరింత హాని.. లాక్డౌన్ తర్వాత సంక్షోభంలోకి
ఈ కామర్స్ సంస్థలకు ఊరట
మెట్రో నగరాలు అన్నీ దాదాపు రెడ్ జోన్లలో ఉన్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అత్యవసరం కానీ వస్తువుల డెలివరీకి అనుమతిచ్చినప్పటికీ ఈ-కామర్స్ కంపెనీలకు ఆశించిన ఆర్డర్స్ లేవు. ఇన్నాళ్లు రెడ్ జోన్లలో అత్యవసర వస్తువుల డెలివరీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి నుండి ఇతర వస్తువుల డెలివరీకి కూడా అనుమతిచ్చింది కేంద్రం. కేంద్రం తాజా ప్రకటనతో మెట్రో నగరాల్లో డెలివరీలకు కంపెనీలు సిద్ధమయ్యాయి. డెలివరీ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
తుది నిర్ణయం రాష్ట్రాలదే
అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్తో పాటు లెన్స్కార్ట్, ఫస్ట్ క్రై, నైకా వంటి సంస్థలు కూడా పూర్తి ఆపరేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఆన్ లైన్ సంస్థలు నిత్యావసర వస్తువులతో పాటు మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులను కూడా విక్రయిస్తాయి. ఇటీవలి వరకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువులు విక్రయించాయి. ఫుడ్, గ్రాసరీ వంటి ఎసెన్షియల్ ఐటమ్స్ అంతటా విక్రయించాయి. కానీ తాజా మార్గదర్శకాలలో ప్రత్యేకంగా నిషేధించబడినవి మినహా అన్నింటికి అనుమతించారు. అయితే స్థానిక అవసరాలు, పరిస్థితుల ఆధారంగా వ్యాపారాల కార్యకలాపాలపై తుది నిర్ణయం రాష్ట్రాలదే.
కస్టమర్లకు సేవలకు సిద్ధం
తాజా ఆదేశాల ప్రకారం కంటైన్మెంట్ జోన్లలో ఆన్ లైన్ సేల్స్ పరిమితంగా ఉంటాయి. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రభుత్వం అనుమతించినందున కస్టమర్లకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్నాప్డీల్ పేర్కొంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అనుతించినప్పటికీ ఎక్కువ మెట్రో నగరాలు రెడ్ జోన్లలో ఉండటంతో ఈ-కామర్స్ బిజినెస్ కేవలం 20 శాతం మాత్రమే నడిచింది.
ఇవి తెలుసుకోండి..
- గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లలోని వారు ఇక నిత్యావసరాలతో పాటు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్స్, గాడ్జెట్స్ తదితరాలు ఆర్డర్ చేసుకోవచ్చు.
- లాక్ డౌన్ 4.0 నుండి ఈ-కామర్స్ సైట్స్ అన్ని రకాల ఉత్పత్తులు డెలివరీ చేయవచ్చు.
- అయితే కంటైన్మెంట్ జోన్ లేదా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం పరిశీలిస్తుంది. అక్కడి పరిస్థితిని బట్టి మెడికల్ ఐటమ్స్, నిత్యావసర వస్తువులకు మాత్రమే మినహాయింపు ఇస్తారు. అంటే కంటైన్మెంట్లోని ప్రజలు ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ మాత్రమే ఆర్డర్ చేయాలి.
- కేంద్ర ప్రభుత్వం భద్రత, సామాజిక దూరం వంటి వివిధ సూచనలతో అనుమతులు ఇచ్చింది. వీటిని ఈ-కామర్స్ ఆచరించాలి.
- ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసే సమయంలో ముందు పిన్ కోడ్ నమోదు చేయాలి. అప్పుడు మీది ఏ జోన్లో ఉందో తెలుస్తుంది. కంటైన్మెంట్ జోన్లో ఉంటే కనుక వైద్య ఉత్పత్తులు, కిరాణా ఉత్పత్తులు సహా ఇతర అవసరమైన ఉత్పత్తులు మాత్రమే ఆర్డర్ చేయవచ్చు.
ఉబెర్, ఓలా
క్యాబ్ హెయిలింగ్ సర్వీసెస్ ఉబెర్, ఓలాలు కూడా కేంద్రం మార్గదర్శకాల జాబితా ప్రకారం నిషేధిత కార్యకలాపాల జాబితాలో లేవు. ఉబెర్, ఓలాలు గత రెండు నెలలుగా మూతబడ్డాయి. ఎమర్జెన్సీకి మాత్రమే ఉపయోగించారు. ఈ-కామర్స్ సంస్థలకు, క్యాబ్ హెయిలింగ్ సంస్థలకు పచ్చజెండా ఊపడం ద్వారా ఈ సంస్థలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.