గ్రీస్ రెఫరెండం: 'నో' Vs 'యస్' ఏమవుతుంది?
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్) గ్రీసు దేశాన్ని ఎగవేతదారుగా ముద్ర వేసింది. రుణదాతల షరతులకు ప్రజలు అంగీకరిస్తారా, వ్యతిరేకిస్తారా? అన్న అంశంపై నిర్వహించిన రెఫరెండంకు 'నో' అంటూ ఆ దేశ ప్రజలు మద్దుతు తెలిపారని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.
దీంతో యూరో జోన్ నుంచి గ్రీస్ బయటకు వెళ్లే పరిస్ధితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రీస్ ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు అవసరమైన నిధులను ఎలా తేవాలనే దానిపై గ్రీస్ దృష్టి సారించింది. ఇందు కోసం గాను స్విస్ బ్యాంకుల్లో గ్రీస్ దేశస్తులు పన్ను ఎగవేసి, బ్యాంకుల్లో దాచుకున్న సంపదను వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
2-200 మిలియన్ యూరోల(రూ. 14,000 నుంచి 14,00,0000 కోట్లు) వరకు నిధులను గ్రీస్కు చెందిన ఖాతాదారులు స్విస్ బ్యాంకుల్లో ఉంచారని అంచనా. ఇప్పటి వరకు వెల్లడించని ఆస్తులపై 21 శాతం పన్ను కడితే సరిపోతుందనే హామీ పన్ను ఎగవేతదారులకు ప్రభుత్వం ఇచ్చిందని తెలుస్తోంది.
గ్రీస్ రెఫరెండం ప్రక్రియలో 'నో' అంటే:
* ప్రధానిగా సిప్రస్ కొనసాగుతారు.
* గ్రీస్లో ఆర్ధిక సంక్షోభం పెరుగుతుంది.
* యూరోజోన్ నుంచి గ్రీస్ బయటకు వస్తుంది.
* యూరోజోన్ దేశాలన్నీ వినియోగిస్తున్న యూరో స్ధానంలో, గతంలో వాడిన 'డ్రక్మా' కరెన్సీ మళ్లీ అమల్లోకి వస్తుంది.
* గ్రీసుకు అప్పులిచ్చిన అంతర్జాతీయ ఆర్ధిక సంస్ధలు, దేశాలన్నింటికీ 'ఎగవేతదారు'గా మారుతుంది.
* గ్రీసుకు అత్యధిక మొత్తంలో అప్పు ఇచ్చిన జర్మనీకి ఇది పెద్ద దెబ్బ.
* గ్రీస్లోని బ్యాంకులన్నీ దివాలా తీస్తాయి. ఇప్పటికే గ్రీస్లోని మూడు పెద్ద బ్యాంకులు మూతపడ్డాయి.
* ఉద్యోగులకు వేతనాలు, ఫించన్ల చెల్లింపు ప్రశ్నార్ధకం. ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు.
గ్రీస్ రెఫరెండం ప్రక్రియలో 'యస్' అంటే:
* యూరోజోన్లోనే కొనసాగుతుంది.
* యూరోజోన్లోని కరెన్సీనే వర్తిస్తుంది.
* అంతర్జాతీయ ఆర్ధిక సంస్ధలకు రుణం చెల్లించాల్సి వస్తుంది.
* ప్రజలపై పన్ను భారం పడుతుంది.
* సిప్రాస్ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో దేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతుంది.