అలాంటి స్టాక్ టిప్స్ చెబుతామంటే జాగ్రత్త, ఇబ్బందులుపడే అవకాశం
కరోనా మహమ్మారి అనంతరం చాలామందిలో స్టాక్స్ లేదా బులియన్ లేదా రియాల్టీలో పెట్టుబడి ఆసక్తి పెరిగింది. భవిష్యత్తులో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని భావిస్తూ ఇన్సురెన్స్లు తీసుకోవడంతో పాటు పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా స్టాక్ మార్కెట్లోకి రిటైల్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. అందుకే మార్కెట్లు ఇటీవల పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ 60,000 పాయింట్లను క్రాస్ చేసి, సరికొత్త రికార్డును సృష్టించింది. స్టాక్ మార్కెట్ పరుగుల నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడి కోసం మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకొని పలువురు టిప్స్ పేరుతో చీటింగ్ చేస్తున్నారు. గతంలోను టిప్స్ పేరిట మోసాలు ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు వేగంగా పెరుగుతుండటంతో ఇలాంటి మోసాలు కూడా అలాగే పెరుగుతున్నాయి.
ఈ సందేశాల పట్ల జాగ్రత్త
మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక, మీకు మంచి టిప్స్ ఇస్తామని, నెలకు కనీసం రెండు మూడు షేర్లు సిఫార్సు చేస్తామని, వాటితో మీరు లక్షల రూపాయలు ఆర్జించవచ్చునని, ఫలానా కంపెనీ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు భారీగా ఆర్జించవచ్చునని రిటైల్ ఇన్వెస్టర్లకు కొన్ని సంస్థల నుండి కాల్స్ లేదా వాట్సాప్ సందేశాలు వస్తాయి. కానీ ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సందేశాలను నమ్మి మోసపోవద్దని, డబ్బులు మాయం చేస్తారని హెచ్చరిస్తున్నారు.
భారీ పతనాలు చూస్తే కోలుకోవడం కష్టమే
స్టాక్ మార్కెట్లో లాభాలకు సమయం తీసుకుంటుంది. స్టాక్ మార్కెట్ పైన ఎన్నో అంశాలు ప్రభావితం చూపుతాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు, ప్రభుత్వ విధానాలు, వృద్ధి రేటు, ఆర్థిక సంక్షోభాలు, ఆయా కంపెనీల పని తీరు, రేటింగ్ ఏజెన్సీల అప్ గ్రెడేషన్, కరోనా వంటి తాత్కాలిక అంశాలు ప్రభావం చూపుతాయి. వీటిని బేరీజు వేసుకొని ఏ స్టాక్లో, ఏ రంగంలో ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకోవాలి. మార్కెట్ పైన అవగాహన పెంచుకోవాలి. కంపెనీల నివేదికల ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి ఆయా స్టాక్స్ పైన పూర్తి అవగాహన పెంచుకొని, మనం సొంతగా నిర్ణయం తీసుకోవాలి. పరిస్థితులు గమనించాలి. నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఆ తర్వాత మన సొంత నిర్ణయంతో ఇన్వెస్ట్ చేయాలి. కరోనా నుండి యువత, కొత్త ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టారు. వారు షేర్ల ధరలు పెరగడం చూశారు. కానీ భారీ పతనాలు అంతగా చూడలేదు. కానీ మార్కెట్ భారీగా పతనమైతే ఎలా ఉంటుందో.. గత ఏడాది మార్చి నెలను పరిశీలించవచ్చు. కానీ కొత్తగా మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న వారు ఆ బేర్ మార్కెట్ తర్వాతనే అడుగు పెట్టారు. కాబట్టి వారు భారీ పతనాలను చూడనందున త్వరగా అప్రమత్తం కాలేరు. పైగా ప్రస్తుత యువత డబ్బులను పెద్దగా కేర్ చేయడం లేదు. దానికి తోడు మార్కెట్లు అప్పుడప్పుడు స్వల్పంగా పడిపోతున్నాయి. దీంతో ఇంతే కదా అనే పరిస్థితి ఉంది. కానీ భారీ పతనాలు చూస్తే మళ్లీ కోలుకోవడం ఇబ్బందికరమే.
ఆ స్టాక్స్లో దీర్ఘకాలానికి
గత కొద్ది రోజులుగా ఐపీవోలకు క్రేజ్ వచ్చింది. లిస్టింగ్ సమయంలో భారీగా లాభపడుతున్నాయి. దీంతో చాలామంది దరఖాస్తు చేస్తున్నారు. ఐపీవోల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్ను ఎప్పటికి అప్పుడు పరిశీలించి భారీగా లాభపడినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం మంచిది. మార్కెట్ను పూర్తిగా పరిశీలిస్తే ఏది విక్రయించాలి.. ఏది కొనుగోలు చేయాలనే విషయం తెలిసిపోతుంది. అయితే కొన్ని స్టాక్స్కు సంబంధించి దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేయాలి. ప్రస్తుతం లేదా షార్ట్ టర్మ్లో ఎలా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ ఉంటాయి.