సెన్సెక్స్ రికార్డ్ ర్యాలీ, 2025 నాటికి 1,25,000 పాయింట్లకు?
స్టాక్ మార్కెట్లు ఈ వారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. నిన్న తీవ్ర ఒడిదుడుకుల మధ్య అతి స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుండి వచ్చిన సంకేతాలతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. డాలర్ మారకంతో రూపాయి 10 పైసలు పెరిగి 73.50 వద్ద క్లోజ్ అయింది. నిన్న సెన్సెక్స్ అతి స్వల్పంగా 55 పాయింట్లు, నిఫ్టీ 15 పాయింట్ల మేర లాభపడింది. అయితే అంతకుముందు రెండు సెషన్లు నష్టాలను నమోదు చేశాయి. దీంతో సూచీలు ఈ వారం కాస్త సానుకూలంగా ముగిశాయి. గణేష్ చతుర్థి సందర్భంగా నేడు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు క్లోజ్ ఉంటాయి.
చివరి సెషన్లో (గురువారం, సెప్టెంబర్ 9) టాప్ గెయినర్స్ జాబితాలో నెస్ట్లే, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, హిండాల్కో, గ్రాసీమ్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, టైటాన్ కంపెనీ, HDFC లైఫ్, అల్ట్రా టెక్ సిమెంట్, బజాజ్ ఆటో నిలిచాయి. సెన్సెక్స్ ఉదయం 58,172 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, 58,334.59 గరిష్టాన్ని, 58,084.99 కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,369.25 దగ్గర స్థిరపడింది
ఎప్పుడైనా కరెక్షన్
ఆర్థిక రికవరీ, కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వంటి అంశాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు రానున్న ఏడాది కాలంలో భారీగా లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే వివిధ రంగాలు, వివిధ స్టాక్స్ అద్భుతంగా రాణించవచ్చునని అంటున్నారు. అయితే త్వరలో మార్కెట్లు భారీ కరెక్షన్కు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.
ఇప్పటికే సూచీలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. గత కొద్ది రోజుల్లోనే సూచీలు ఎగిసిపడ్డాయి. కరోనా సెకండ్ వేవ్కు ముందు 53వేల పాయింట్ల స్థాయికి చేరుకున్న సెన్సెక్స్ సెకండ్ వేవ్ సమయంలో 47,000 స్థాయికి పడిపోయింది. ఆ స్థాయితో ఇప్పుడు 11వేలకు పైగా పాయింట్లతో ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ మేర రాణించడంతో ఇన్వెస్టర్లు త్వరలో ఎప్పుడైనా పెద్ద మొత్తంలో ప్రాఫిట్ బుకింగ్కు సిద్ధమవుతారని చెబుతున్నారు. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
సెన్సెక్స్ 1,25,000 పాయింట్లకు..
సెన్సెక్స్ వచ్చే నాలుగేళ్ల కాలంలో 1,25,000 పాయింట్లకు చేరుకోవచ్చునని యస్ సెక్యూరిటీస్ ఎన్విషన్స్ హెడ్ అమర్ అంబానీ అభిప్రాయపడ్డారు. ఆయనకు మార్కెట్ పైన పదిహేనేళ్ల అనుభవం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కరోనా ముందుస్థాయికి క్రమంగా చేరుకుంటోంది. అయితే అంతలోనే మళ్లీ డెల్టా వేరియంట్ ప్రభావం కనిపిస్తోంది. ఈ ప్రభావం మార్కెట్ల పైన కనిపిస్తోంది.
18000కు కూడా చేరుకోవచ్చు
ప్రస్తుత క్యాలెండర్ ఏడాదిలో నిఫ్టీ 18,000 డాలర్లకు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, 19,000 నుండి 20,000కు చేరుకునే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. ఇక సెన్సెక్స్ డిసెంబర్ 2025 నాటికి 125,000 పాయింట్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు. రియాల్టీ స్టాక్స్ గత రెండు వారాల్లో 12 శాతానికి పైగా లాభపడ్డాయి. నిన్న సెన్సెక్స్ 30లో 19 కంపెనీలు లాభపడ్డాయి. వినాయక చవితి సందర్భంగా నేడు మార్కెట్లు క్లోజ్ కాబట్టి ఈ వారం నాలుగు రోజులు వర్క్ చేశాయి.