షేర్ మార్కెట్ కాదు.. రియల్ ఎస్టేట్ కాదు.. ధనవంతులు తమ డబ్బంతా ఈ ఒక్క చోటుకే తరలిస్తున్నారు..
Wealth Creation: సాంప్రదాయకంగా ధనవంతులు తమ సంపదను పెంపొందించుకోవడానికి స్టాక్ మార్కెట్లు, బంగారం లేదా రియల్ ఎస్టేట్ రంగాలను ఆశ్రయించేవారు. అయితే, ఇటీవల కాలంలో భారతదేశంలోని ఫ్యామిలీ ఆఫీసులు (ధనవంతుల సంపద నిర్వహణ సంస్థలు) తమ పెట్టుబడి వ్యూహాన్ని వేగంగా మారుస్తున్నాయి. ఇకపై కేవలం సంప్రదాయ ఆస్తులకే పరిమితం కాకుండా ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ క్రెడిట్, సరికొత్త సాంకేతిక రంగాల వంటి 'ప్రత్యామ్నాయ ఆస్తులలో' (Alternative Assets) భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
ఒక తాజా నివేదిక ప్రకారం అనేక ఫ్యామిలీ ఆఫీసులు తమ మొత్తం పోర్ట్ఫోలియోలలో 10 నుండి 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ప్రైవేట్ ఈక్విటీ (PE) మరియు వెంచర్ క్యాపిటల్ (VC)లలో కేటాయిస్తున్నాయి. వీరు కేవలం థర్డ్-పార్టీ ఫండ్ల ద్వారానే కాకుండా, స్టార్టప్లు, లిస్ట్ అవ్వని కంపెనీలలో (Unlisted Companies) నేరుగా ఈక్విటీ వాటాలను కొనుగోలు చేస్తున్నారు. పెద్ద అంతర్జాతీయ ఫండ్లతో కలిసి 'కో-ఇన్వెస్ట్మెంట్' (సహ-పెట్టుబడి) చేయడానికి కూడా ఆసక్తి చూపుతున్నారు.

బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపల నేరుగా కార్పొరేట్లకు, వ్యాపారాలకు రుణాలు అందించే 'ప్రైవేట్ క్రెడిట్' ఎంపికకు కూడా ఫ్యామిలీ ఆఫీసుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం భారతదేశ ప్రత్యామ్నాయ ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు 400 బిలియన్ డాలర్లుగా ఉండగా.. రాబోయే 2034 నాటికి ఇది ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు పైగా వృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనితో పాటు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (AIFలు), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (REITలు) మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు (InvITలు) లలో కూడా నిధులు భారీగా ప్రవహిస్తున్నాయి.
సంపన్న కుటుంబాలు కేవలం దేశీయ మార్కెట్లలోనే కాకుండా.. అంతర్జాతీయ సాంకేతిక పరిణామాల ద్వారా లబ్ధి పొందేందుకు గ్లోబల్ మార్కెట్లలోకి అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లైమేట్ టెక్ (వాతావరణ సాంకేతికత), పునరుత్పాదక శక్తి, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలలో భారీ పెట్టుబడులు పోటెత్తుతున్నాయి.
భారతదేశ సంపన్నుల పెట్టుబడి వైఖరిలో వస్తున్న ఈ గణనీయమైన మార్పు వెనుక ప్రధానంగా మూడు అంశాలు కనిపిస్తున్నాయి:
యువతరం నాయకత్వం: భారతీయ సంపన్నులలో దాదాపు 20 శాతం మంది 40 ఏళ్లలోపు వారే కావడం విశేషం. విదేశాలలో విద్యాభ్యాసం చేసిన ఈ యువతరం, కేవలం పరంపరాగతమైన కుటుంబ వ్యాపారాలకే పరిమితం కాకుండా టెక్నాలజీ, హెల్త్కేర్, మీడియా, వాతావరణ పరిరక్షణ వంటి రంగాలపై ఆసక్తి చూపుతున్నారు.
కాన్సంట్రేషన్ రిస్క్ నివారణ: తమ మొత్తం సంపదను ఒకే దేశం లేదా ఒకే ఆస్తి విభాగంలో పెట్టడం వల్ల కలిగే నష్టభయాన్ని (Concentration Risk) తగ్గించుకోవడానికి విదేశీ మార్కెట్లలో పోర్ట్ఫోలియోను విస్తరిస్తున్నారు. గుజరాత్లోని గిఫ్ట్ సిటీ (GIFT City) వంటి నియంత్రిత మార్గాల ద్వారా అంతర్జాతీయంగా పెట్టుబడులు పెట్టడం వారికి సులభతరమైంది.
వృత్తిపరమైన నిర్వహణ: ప్రత్యామ్నాయ ఆస్తులు సంక్లిష్టమైనవి కావడం, అలాగే ఇవి 5 నుండి 10 సంవత్సరాల సుదీర్ఘ 'లాక్-ఇన్ పీరియడ్' కలిగి ఉండటంతో, వీటి నిర్వహణకు ఫ్యామిలీ ఆఫీసులు చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్లను (CIOలు), ఆర్థిక నిపుణులను నియమించుకుంటూ మరింత కార్పొరేట్ శైలిలో పారదర్శక వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications
