UPI వినియోగదారులకు అలర్ట్.. కలెక్ట్, ఆటోపే ఫీచర్లపై NPCI కొత్త రూల్స్.. మోసపూరిత లావాదేవీలపై డేగ కన్ను
ఇటీవల పెరుగుతున్న మోసపూరిత డిజిటల్ లావాదేవీలపై ఆందోళనల నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులను పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కలెక్ట్ (Collect), ఆటోపే (AutoPay) ఫీచర్లలో దుర్వినియోగం జరుగుతోందన్న నివేదికల తర్వాత ఈ చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయానికి సంబంధించిన అధికార వర్గాల సమాచారం ప్రకారం.. కస్టమర్ల నష్టాలను తగ్గించడం, మోసాలకు అడ్డుకట్ట వేయడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం కలెక్ట్ ఫీచర్ ద్వారా వ్యాపారులు కస్టమర్లకు డబ్బు కోసం అభ్యర్థనలు పంపగలుగుతున్నారు. అంటే కస్టమర్ స్వయంగా చెల్లింపును ప్రారంభించాల్సిన అవసరం లేకుండా.. వ్యాపారులే పేమెంట్ రిక్వెస్ట్ పంపుతారు. అయితే ఈ విధానం మోసగాళ్ల చేతుల్లో ఒక సాధనంగా మారుతోందని NPCI గుర్తించింది. ముఖ్యంగా వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపారి (P2PM) కేటగిరీలో ఈ ఫీచర్ దుర్వినియోగం ఎక్కువగా జరుగుతోందని అంచనా. అందుకే, ఈ కేటగిరీలో కలెక్ట్ ఫీచర్ను దశలవారీగా తొలగించేందుకు సిద్ధంగా ఉండాలని NPCI ఇప్పటికే చెల్లింపు అగ్రిగేటర్లకు సూచించినట్టు సమాచారం.

ఇదే సమయంలో.. ఆటోపే ఫీచర్ విషయంలో కూడా మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆటోపే సాధారణంగా బిల్లులు, OTT సబ్స్క్రిప్షన్లు, ఇతర పునరావృత చెల్లింపులకు ఉపయోగిస్తారు. అయితే.. స్పష్టత లేని డిస్ప్లే ఫార్మాట్ల వల్ల చాలా మంది కస్టమర్లు తాము అనుకోకుండా దీర్ఘకాలిక సబ్స్క్రిప్షన్లకు అంగీకరిస్తున్నారని చెల్లింపు అగ్రిగేటర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆటోపే కోసం మరింత కఠినమైన డిస్ప్లే నిబంధనలు అమలు చేయాలని NPCI యోచిస్తోంది. దీని వల్ల కస్టమర్లు ఏ చెల్లింపుకు అంగీకరిస్తున్నారు. ఎంత మొత్తం, ఎంత కాలం పాటు అన్నది స్పష్టంగా చూడగలుగుతారు.
చెల్లింపు అగ్రిగేటర్ల అభిప్రాయం ప్రకారం.. భవిష్యత్తులో కలెక్ట్ ఫీచర్ ఉద్దేశ్య-ఆధారిత, QR కోడ్ ఆధారిత లావాదేవీల వైపు మారే అవకాశం ఉంది. దీనివల్ల మోసపూరిత ఛార్జీలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం P2P కలెక్ట్పై ఆధారపడే కొంతమంది చిన్న వ్యాపారులు తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొనవచ్చు. లిస్టెడ్ ఫిన్టెక్ కంపెనీలపై ప్రభావం విషయానికి వస్తే.. EY ఇండియాలో భాగస్వామి, చెల్లింపుల రంగ నిపుణుడు రణదుర్జయ్ తాలూక్దార్ మాట్లాడుతూ.. ఈ మార్పులు Paytm, Pine Labs, MobiKwik వంటి సంస్థలకు గణనీయమైన నష్టం కలిగించవని అభిప్రాయపడ్డారు.
ఎందుకంటే.. P2P కలెక్ట్ వీరి ప్రధాన ఆదాయ వనరు కాదని, వీరి ఆదాయం ప్రధానంగా వ్యాపారి చెల్లింపులు, విలువ ఆధారిత సేవలు, రుణాలు మరియు POS పరిష్కారాల నుంచే వస్తుందని తెలిపారు. QR చెల్లింపులు, సాధారణ వ్యాపారి సేకరణ పద్ధతులు కొనసాగుతాయన్న కారణంగా.. అధికారిక వ్యాపారులు పెద్దగా ప్రభావితమయ్యే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే పూర్తిగా P2P కలెక్ట్పై ఆధారపడే చిన్న వ్యాపారులు QR లేదా పుష్ పేమెంట్లకు మారే వరకు కొంత సర్దుబాటు చేసుకోవాల్సి రావచ్చు.
వెంచురా సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ వినిత్ బోలింజ్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్పుల వల్ల లావాదేవీలపై పెద్దగా ప్రభావం ఉండదని, ఫిన్టెక్ రంగంలో వృద్ధి కొనసాగుతుందని చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే.. వ్యాపారి ప్రారంభించిన కలెక్ట్ అభ్యర్థనలను పరిమితం చేయడం వల్ల సోషల్ ఇంజనీరింగ్ ఆధారిత మోసాలు తగ్గే అవకాశం ఉందని, ఇది కస్టమర్ల నమ్మకాన్ని పెంచి, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications


