భారత మార్కెట్లో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి.. ఎందుకంటే
కరోనా మహమ్మారి నుండి స్టాక్ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో ఉన్నాయి. గత ఏడాది(2020) మార్చిలో సెన్సెక్స్ 26,000 దిగువకు పతనమైంది. ఆ తర్వాత ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. సెన్సెక్స్ ఇటీవల 62,245 పాయింట్లను తాకింది. ఏడాదిన్నర క్రితం 26,000 పాయింట్ల దిగువతో పోలిస్తే ఈ కాలంలో 36,000 పాయింట్లు ఎగిసింది. అంటే దాదాపు ఒకటిన్నర రెట్లు పుంజుకుంది. తద్వారా సూచీలు సరికొత్త గరిష్టాలను తాకాయి. అయితే ఈ వారం ప్రారంభంలో లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, మూడు రోజులుగా నష్టాలను నమోదు చేస్తున్నాయి.
నిన్న సెన్సెక్స్ ఏకంగా 1158 పాయింట్లు నష్టపోయింది. ఏప్రిల్ 12 తర్వాత గరిష్టం ఇదే. అప్పుడు 1708 పాయింట్లు కోల్పోయింది. ఇలాంటి డిప్ సమయంలో స్టాక్స్ను కొనుగోలు చేయవచ్చా? అంటే ఇన్వెస్ట్ చేయవచ్చునని చెబుతున్నారు జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటెజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ వుడ్ అన్నారు. ఓ వైపు UBS, HSBC, నోమురా, మోర్గాన్ స్టాన్లీ వంటి గ్లోబల్ రీసెర్చ్ అండ్ బ్రోకరేజీ హౌసెస్ ఇండియన్ ఈక్విటీస్కు డౌన్ గ్రేడ్ అంచనాలతో ఉండగా, క్రిస్టోఫర్ వుడ్ డిప్ సమయంలో కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.
అప్పుడు కొని పెట్టుకోండి
భారత స్టాక్ మార్కెట్ రేటింగ్ను మోర్గాన్ స్టాన్లీ, నోమురా, UBS, HSBC తగ్గించాయి. షేర్లు అధిక వ్యాల్యూకు చేరడంతో ప్రస్తుతమున్న ఓవర్ వెయిట్ నుండి ఈక్వల్ వెయిట్కు కుదించాయి. స్వల్పకాలంలో ప్రతికూలతల కారణంగా మార్కెట్ స్థిరీకరించుకోవచ్చని అంచనా వేశాయి. వడ్డీ రేట్ల పెంపునకు ఫెడ్ నిర్ణయం, వచ్చే ఫిబ్రవరిలో ఆర్బీఐ కీలక రేట్లు పెంచవచ్చుననే అంచనాలు, అధిక ఇంధన ఖర్చులు వంటి వాటిని ఇందుకు కారణాలుగా పేర్కొన్నాయి. క్రిస్టోఫర్ వుడ్ భారత ఈక్విటీ మార్కెట్ పైన బుల్లిష్గా ఉన్నారు. రేటింగ్ను ఓవర్ వెయిట్గానే కొనసాగిస్తున్నారు.
అంతేకాదు, సూచీలు పడిపోయిన కొద్దీ స్టాక్స్ కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతామన్నారు. వచ్చే పదేళ్ల పాటు భారత స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడులు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వడ్డీ రేట్ల పెంపు, ప్యాకేజీ ఉపసంహరణ వంటి అంశాలు దీర్ఘకాలంలో మార్కెట్ పైన ప్రభావం చూపవన్నారు. అంతేకాదు, వీటి వల్ల మార్కెట్ పడినప్పుడు స్టాక్స్ కొని పెట్టుకోవడం మంచిదని సూచించారు.
పదేళ్ల పాటు అదుర్స్
వచ్చే పదేళ్ల పాటు మంచి అవకాశాలు ఉన్న మార్కెట్గా భారత స్టాక్ మార్కెట్లను పేర్కొన్నారు వుడ్. గత కొద్ది రోజులుగా భారత మార్కెట్ గరిష్టాలను తాకుతూనే, మళ్లీ ఆ గరిష్టాల నుండి కిందకు పడిపోతోంది. ఇటీవలే సూచీలు దాదాపు 3 శాతం మేర పడిపోయాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు చివరి కొన్ని ట్రేడింగ్ సెషన్స్లో పదివేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. వీటికి తోడు సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేవు.
ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్భణ భయాలు అలుముకున్నాయి. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు పలు దేశాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చేందుకు ప్రకటించిన ఉద్దీపనలను ఉపసంహరించుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్న స్టాక్స్ పడిపోతున్నాయి. మున్ముందు పరిస్థితి సర్దుకుంటే ఈ స్టాక్స్ మరింత పరుగులు పెడతాయని భావిస్తున్నారు.
పెట్టుబడి రిస్క్..
స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి రిస్క్తో కూడుకున్నది. ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వంటి పెట్టుబడులలో హామీ ఉంటుంది. కానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ధైర్యం చేయాలి. మార్కెట్ కుప్పకూలినప్పుడు నష్టపోవాల్సి ఉంటుంది. మార్కెట్ పరుగులు పెడితే లాభాలు వస్తాయి. కాబట్టి స్టాక్స్ పైన పూర్తి అవగాహనతో, నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేయడం మంచిది.