Money Management: సంపాదిస్తే సరిపోదు గురూ.. పొదుపు కూడా చేయాలి..!
మధ్య తరగతి వ్యక్తి కోటీశ్వరుడు కావాలంటే ఏం చేయాలి అంటే సంపాదించాలని చెబుతాం. అయితే సంపాదన ఒక్కటే కాదు.. ఆ డబ్బును పొదుపు చేస్తేనే కోటీశ్వరుడు అవుతారని బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయెల్ చెబుతున్నారు. నీకు ఎంత జీతం వచ్చినా.. పొదుపు లేకుంటే కోటీశ్వరుడు కావడం సాధ్యం కాదని వివరిస్తున్నారు. ఆర్థిక క్రమ శిక్షణ, ఖర్చుల నియంత్రణ, దీర్ఘకాలిక పెట్టుబడులే అసలైన సంపదకు మార్గమని పేర్కొన్నారు. ఆమె లింక్డ్ఇన్లో కొన్ని సలహాలు ఇచ్చారు.
తన కెరీర్ ఆరంభంలో కోటి సంపాదిస్తేనే ధనవంతురాలినని అనుకునేదాన్ని అని గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత అనుభం పెరిగే కొద్దీ ధనవంతులు ఎవరు అవుతారని ఒక ఐడియా వచ్చిందని వివరించారు. సంపాదించిన దాంట్లో ఎంత పొదుపు చేస్తున్నామనేది కీలకమని స్పష్టం చేశారు. చాలా మందికి ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చు కూడా పెరుగుతుందని చెప్పారు. ఇది చాలా మందికి సమస్యగా ఉంటుందని పేర్కొన్నారు. కొంత మంది జీతం పెరిగితే.. వారు అధిక రెంట్ ఉన్న ఇంట్లోకి మారుతారు. లేదంటే ఈఎంఐపై కార్లు కొనుగోలు చేస్తారు.

రెగ్యులర్ గా బయట తినడం చేస్తారు. లైఫ్ స్టైల్ ను మారుస్తారు. దీని వల్ల ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు. ఆమె ఒక ఉదాహరణతో ప్రస్తావించారు. సంవత్సరానికి రూ.50 లక్షలు సంపాదించే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కంటే సంవత్సరానికి రూ.12 లక్షలు జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగులే ఎక్కువ పొదుపు చేస్తారని చెప్పారు. ఖర్చులో నియంత్రణ ఉంటేనే పొదుపు చేయగలుగుతామని స్పష్టం చేశారు. రెగ్యులర్ గా పొదుపు చేయడం, పథకాల్లో పెట్టుబడులు కొనసాగించడం, జీతం పెరిగినప్పుడు కొంత భాగాన్ని పక్కకు పెట్టడం వంటి చేయాలన్నారు.
దాదాపు 10 శాతం వార్షిక జీతం పెరుగుదలతో పాటు దీర్ఘకాలంలో సగటున 12-15 శాతం పెట్టుబడి రాబడిని సాధించగలిగితే, పదేళ్ల వ్యవధిలో కోటి రూపాయల పెట్టుబడి విలువను చేరుకోవడం సాధ్యమేనని చెప్పారు. జీతం పెరిగిన వెంటనే ముందుగా ఎస్ఐపీ, పీఎఫ్, ఎన్పీఎస్ లేదా ఇతర దీర్ఘకాలిక పెట్టుబడుల్లో వాటాను పెంచాలని ఆమె చెబుతున్నారు. సాధారణంగా అత్యవసర నిధి, తగిన బీమా, క్రమబద్ధమైన పెట్టుబడులు, అవసరం లేని రుణాలకు దూరంగా ఉండటం ద్వారా దీర్ఘకాలంలో గణనీయమైన సంపదను సృష్టించవచ్చని వివరిస్తున్నారు.


Click it and Unblock the Notifications