ఏప్రిల్ 1 నుండి టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్ మరింత భారం
లైఫ్ ఇన్సురెన్స్ రంగంలో కొన్ని కంపెనీలు టర్మ్ పాలసీ ప్రీమియంలు భారం కానున్నాయి. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సురెన్స్, కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ ఇన్సురెన్స్, పీఎన్బీ మెట్ లైఫ్ వంటి పలు సంస్థలు ఏప్రిల్ 1వ తేదీ టర్మ్ పాలసీల ప్రీమియంను పెంచే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రీమియంలు 15 శాతం వరకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నాయి.
దీర్ఘకాలంగా టర్మ్ పాలసీల ప్రీమియంలు తక్కువగా ఉండటం, క్లెయిమ్స్ పెరగడం, రీ-ఇన్సూరర్లు రేట్లు పెంచడం వంటి కారణాల వల్ల టర్మ్ పాలసీల ప్రీమియంను పెంచే దిశగా కంపెనీలు ఆలోచన చేస్తున్నాయి. కరోనా అనంతరం టర్మ్ పాలసీలకు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రీమియం పెంపు ప్రభావం అంతగా ఉండకపోవచ్చునని అంటున్నారు.
బీమా పాలసీపై అవగాహన
కరోనా నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారించడంతో పాటు బీమాపై అవగాహన పెరిగింది. బీమా పాలసీ చాలామందికి తెలిసివచ్చింది. అందుకే ఈ ఏడాది టర్మ్ పాలసీ, సాధారణ జీవిత బీమా, ఆరోగ్య బీమాకు డిమాండ్ పెరిగింది. ఇప్పటి వరకు ఉన్న ప్రీమియంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కాస్త పెరగనుంది. ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరం చాలా వరకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం పెరగనుంది. ఇందుకు పలు కారణాలు ఉంటాయి. ఒకటి కరోనా, రెండు రీఇన్సూరెన్స్ సంస్థలు ప్రీమియం పెంచడం ప్రభావం చూపనుంది.
అదే దారిలో మిగతా కంపెనీలు
టర్మ్ పాలసీల ప్రీమియం వచ్చే కొద్ది నెలల్లో 10 శాతం నుండి 15 శాతం పెరగవచ్చునని నిపుణుల అంచనా. ఇప్పటికే టాటా ఏఐఏ, ఎగన్ లైఫ్, మ్యాక్స్ లైఫ్, PNB మెట్ లైఫ్, ఇండియాఫస్ట్ లైఫ్ తదితర సంస్థలు ప్రీమియం పెంచుతూ కొత్త పాలసీలకు సంబంధించిన వివరాలను బీమా నియంత్రణ సంస్థ Irdaiకు సమర్పించిందని తెలుస్తోంది. ఇతర ప్రయివేటు కంపెనీలు ఇదే బాటలో నడిచే అవకాశముంది.
ఎల్ఐసీ ఏం చేస్తుందో
ప్రీమియం పెంపుపై LIC ఏం నిర్ణయం తీసుకుందనే సమాచారం లేదు. LIC ప్రీమియంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చునని అంటున్నారు. కరోనాతో పాటు వివిధ కారణాలతో బీమా క్లెయిమ్స్ పెరిగాయి. ఇది రీఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టాలను తెచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆర్థిక రక్షణ కల్పించే సంస్థలే రీఇన్సూరెన్స్ కంపెనీలు. ఇవి బీమా సంస్థలకు బీమా కల్పిస్తాయి. సాధారణంగా ఎక్కడైనా వైపరీత్యం తలెత్తితే ఆ ప్రాంతానికే పరిమితం కావడం వల్ల మిగతా ప్రాంతాల్లో వచ్చే ఆదాయంతో రీఇన్సురెన్స్ కంపెనీలు నష్టాలను పూడ్చుకుంటాయి. కానీ కరోనా ప్రపంచాన్ని కుదిపేయడం నష్టాలను తెచ్చింది.