సుభాష్ చంద్ర రూ. 22 వేల కోట్ల అప్పు నిజంగానే మాఫీ అయ్యిందా.. మొత్తం రూ. 6.5 కోట్లకు ఎందుకు తగ్గింది..
జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా వ్యవహారంలో జాతీయ కంపెనీ చట్టాల ట్రిబ్యునల్ (ఎన్సిఎల్టి) ఢిల్లీ బెంచ్ ఇచ్చిన ఆమోదం ప్రస్తుతం దేశీయ ఆర్థిక, కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆయనపై నమోదు చేసిన రూ. 22,006 కోట్ల మొత్తం క్లెయిమ్లను కేవలం రూ. 6.25 కోట్లు చెల్లించి పరిష్కరించుకోవడానికి ఎన్సిఎల్టి అనుమతించడం బ్యాంకింగ్ రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై ఒకవైపు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి ప్రధాన రుణదాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు ప్రచారంలో ఉన్న '99.97 శాతం మాఫీ' అంకె కేవలం తప్పుదోవ పట్టించే అంశమేనంటూ ప్రభుత్వ వర్గాలు వివరణ ఇస్తున్నాయి.
ఈ సంక్లిష్టమైన కేసును పరిశీలిస్తే.. ట్రిబ్యునల్లో ఇద్దరు సభ్యుల బెంచ్ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో వ్యవహారం మూడవ న్యాయ సభ్యుడైన నిలేష్ శర్మ వద్దకు చేరింది. ఆయన ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబిసి) సెక్షన్ 114 కింద ఈ పరిష్కార ప్రణాళికకు ఆమోదం తెలిపారు. ట్రిబ్యునల్ వ్యాఖ్యానించిన దాని ప్రకారం.. చంద్ర వద్ద ఉన్న వ్యక్తిగత ఆస్తుల విలువ ప్రతిపాదించిన మొత్తానికంటే చాలా తక్కువగా ఉందని, ఆయనను పూర్తిగా దివాలా ప్రక్రియలోకి నెట్టడం వల్ల వ్యతిరేకిస్తున్న బ్యాంకులకు ఒరిగేదేమీ ఉండదని పేర్కొంది. మొత్తం 80.8 శాతం ఓటింగ్ వాటా కలిగిన రుణదాతలు ఈ ప్రణాళికకు మద్దతు తెలపగా.. ప్రధాన బ్యాంకులు మాత్రం దీనిని వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన కింద చంద్ర వ్యక్తిగత హామీదారుగా రూ. 6.25 కోట్లు చెల్లించనుండగా, రుణాలను అసలుగా వినియోగించుకున్న ప్రధాన కంపెనీలు విడిగా రూ. 1,494 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, బ్యాంకులు ఏకంగా రూ. 22,000 కోట్ల రుణాన్ని మాఫీ చేశాయనే కోణాన్ని ప్రభుత్వ వర్గాలు గట్టిగా ఖండిస్తున్నాయి. ఈ రూ. 22,006 కోట్ల నంబర్.. సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్న రుణం కాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇందులో కేవలం రూ. 2,574 కోట్లు మాత్రమే మొదట్లో ఆయన అందించిన వ్యక్తిగత పూచీకత్తులకు వర్తిస్తాయి. కార్పొరేట్ రుణగ్రహీతలు తమ అప్పులకు పూర్తిగా బాధ్యత వహించాల్సిందేనని.. చంద్ర వ్యక్తిగత పరిష్కారంతో సంబంధం లేకుండా ఆ మూల కంపెనీల నుండి బకాయిలు, వాటి సెక్యూరిటీలు, అందుబాటులో ఉన్న ఆస్తులను వసూలు చేసుకునే హక్కు రుణదాతలకు కొనసాగుతుందని వివరించారు.
దీనికి భిన్నంగా, రుణదాతలైన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంకులు ఈ ప్రతిపాదనను ఆచరణ సాధ్యం కానిదిగా, చట్టవిరుద్ధమైనదిగా అభివర్ణిస్తున్నాయి. గతంలో చంద్ర చూపించిన నికర ఆస్తి విలువ వేల కోట్లలో ఉండగా, ఇప్పుడు సడన్గా అది కేవలం సుమారు రూ. 31.79 కోట్లకు పడిపోవడం వెనుక ఉన్న కారణాలపై లోతైన విచారణ జరగాలని బ్యాంకులు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో వారు నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సిఎల్ఏటి)లో ఎన్సిఎల్టి తీర్పును సవాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు సుభాష్ చంద్ర మాత్రం తాను ఏ బ్యాంకు వద్ద నుంచి వ్యక్తిగతంగా రుణాలు తీసుకోలేదని, తన కంపెనీలు ఇప్పటికే రూ. 43,000 కోట్లను రుణదాతలకు తిరిగి చెల్లించాయని.. మిగిలిన బకాయిలను కూడా ఆ సంస్థలే చెల్లిస్తాయని స్పష్టం చేశారు.
ఈ ఉదంతం భారతీయ దివాలా ప్రక్రియ (ఐబిసి) వ్యవస్థ వైఫల్యం కిందకు రాదని.. ఇది కేవలం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగత-హామీదారు పరిష్కార కేసని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తంమీద ఎన్సిఎల్టి అసలు డివిజన్ బెంచ్ జారీ చేయబోయే అధికారిక ఉత్తర్వులు, తదనంతరం బ్యాంకులు అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించడం ద్వారా ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications
